జనసేనపై ఆ కామెంట్స్ చేయలేదు, కావాలనే వైరల్, సస్పెండ్ చేశారని ప్రచారం: రాపాక వరప్రసాద్
ఆంధ్రప్రదేశ్లో జనసేనకు ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్. అయితే ఆయన వైసీపీ నుంచి టికెట్ ప్రయత్నించినా.. రాకపోవడంతో జనసేన నుంచి పోటీ చేసి గెలుపొందారు. అయితే ఇటీవల ఆయన జనసేన గాలికి వెళ్లే పార్టీ అని అన్నట్టు వీడియాలో కథనాలు వచ్చాయి. దీనిపై రాపాక వరప్రసాద్ స్పందించారు. తానలా ఏ మీడియాతో అనలేదని వివరణ ఇచ్చారు.
జనసేన నుంచి రాపాక.. గెలిచినప్పటీ నుంచి అధినేత పవన్ కల్యాణ్తో సత్సంబంధాలు లేవనే చెప్పాలి. ఈ క్రమంలో కామెంట్లు కలకలం రేపాయి. వైసీపీలో చేరతారా అనే ప్రశ్న వచ్చింది. కానీ దీనిపై రాపాక స్పందిస్తూ.. జనసేన గాలికి వెళ్లిపోయే పార్టీ అని గానీ, గాలి పార్టీ అని అనలేదని స్పష్టం చేశారు. కొందరు కావాలనే వక్రీకరించారని పేర్కొన్నారు. న్యూస్ వైరల్ చేసి లబ్ది పొందాలని చూస్తున్నారని ఆరోపించారు. అంతేకాదు తనను జనసేన పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్టు కూడా ఫేక్ న్యూస్ వస్తున్నాయని తెలిపారు.
అధికార పార్టీకి సన్నిహితంగా ఉంటేనే పనులు జరుగుతాయని రాపాక తెలుపడం విశేషం. ఎన్నికలకు ముందు చివరి నిమిషం వరకు వైసీపీ టికెట్ కోసం ప్రయత్నించానని తెలిపారు. తనకు బొంతు రాజేశ్వరరావు వల్ల తనకు టికెట్ రాలేదని వెల్లడించారు. తాను జన సైనికుల వల్లే గెలవలేదని హాట్ కామెంట్స్ చేశారు జనసైనికుల ప్రభావం ఉండుంటే రాష్ట్రం మొత్తం పార్టీ గెలిచేదని అభిప్రాయపడ్డారు. జనసైనికులతోపాటు మిగతావారు కూడా ఓట్లు వేశారని తెలిపారు. తాను వారికి కూడా సమాధానం చెప్పుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు. అభివృద్ధి పనుల కోసం వైసీపీతో సఖ్యంగా ఉంటున్నానని.. తప్ప తాను జనసేనను తక్కువచేసి మాట్లాడలేదని పేర్కొన్నారు.