మాయావతి సోదరుడి కోట్ల గుట్టు రట్టు: వైయస్ జగన్కూ లింక్?
బిఎస్పీ నేత మాయావతి సోదరుడి మనీ లాండరింగ్ వ్యవహారంలో వైయస్ జగన్కు కూడా పాత్ర ఉన్నట్లు ఓ జాతీయ వార్తాసంస్థ దర్యాప్తులో తేలింది.
న్యూఢిల్లీ: మాయావతి సోదరుడు ఆనంద కుమార్ సంపద అనూహ్యంగా పెరిగిన విషయంపై జరుగుతున్న విచారణలో మరిన్ని విషయాలు వెలుగు చూశాయి. తాము జరిపిన దర్యాప్తులో మరిన్ని విషయాలు వెలుగు చూశాయిని టైమ్స్ నౌ వ్యాఖ్యానించింది. అందుకు సంబంధించిన వార్తాకథనాన్ని ఇచ్చింది. 2007 -2104 మధ్య కాలంలో అంటే, ఏడేళ్లలో అనంద కుమార్ ఆస్తులు రూ.7.5 కోట్ల నుంచి రూ.1,316 కోట్లకు పెరిగినట్లు గుర్తించిన విషయం తెలిసిందే.
మనీ లాండరింగ్ వ్యవహారం ద్వారా ఆనంద కుమార్ తన ఆస్తులను ఇబ్బడి ముబ్బడి చేసుకున్నట్లు తెలుస్తోంది. మనీ లాండరింగ్ లింకులు కేవలం ఆనంద కుమార్కే పరిమితం కాలేదని, మరో ఇద్దరి పేర్లు కూడా వెలికి వచ్చాయని ఆ వార్తా సంస్థ తన వార్తాకథనం తెలిపింది. వారిలో ఒకరు ఎన్సీపి నేత ఛగన్ భుజబల్ కాగా, మరొకరు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి. ఛగన్ భుజబల్ కుమారుడు, అల్లుడికి సంబంధాలున్నట్లు ఆ వార్తా సంస్థ తెలిపింది.
ఘోస్ట్ కెంపనీ హింగోరా ప్రైవేట్ లిమిటెడ్ మాయావతి సోదరుడి కంపెనీలో పెట్టుబడులు పెట్టిందని, ఆ కంపెనీ వైయస్ జగన్మోహన్ రెడ్డిదే కాకుండా ఛగన్ భుజబల్ కుమారుడిదీ అల్లుడిదీ అని ఆ వార్తాసంస్థ తెలిపింది. మాయావతి యూపీ సీఎంగా ఉండగా ఆమె సోదరుడు ఆనంద్ కుమార్ ఆస్తులు రూ.7 కోట్ల నుంచి 1300 కోట్లకు పెరిగాయి. ఇటీవలి దాకా ఈ విషయాన్ని ఎవరూ పట్టించుకోలేదు. అయితే, పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో ఆనంద కుమార్ వ్యవహారం బయటపడింది.
మాయావతి పార్టీ బీఎస్పీ ఖాతాలో రూ.104 కోట్లు, ఆమె సోదరుడి ఖాతాలో 1.43 కోట్లు జమ అయినట్లు అధికారులు గుర్తించారు. దీంతో ఆనంద్ కుమార్పై ఐటీ, సీబీఐ అధికారులు దృష్టి సారించారు. విషయాన్ని ఆయన ఒక్కరికే పరిమితం చేయడంలేదు. సూట్కేస్ కంపెనీల సహాయంతో నల్లధనాన్ని మార్చుకున్న రాజకీయ నాయకులు, వారి వారసులందరిపైనా ఐటీ శాఖ దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అంతర్గత సమాచారాన్ని కూడా ఇప్పటికే రాబట్టినట్లు తెలుస్తోంది.
జాతీయ మీడియా వార్తాకథనం ప్రకారం - ఆనంద్ ప్రముఖ పాత్ర పోషిస్తున్న ఆకృతి హోటల్స్లో హింగోరాకు ఈ సంస్థకు 0.8 శాతం వాటా ఉంది. హింగోరా సంస్థ చిరునామా ముంబైలోని భయాందర్లో ఒక నివాస సముదాయంలో ఉంది. ఆ చిరునామాకు వెళ్లి విచారిస్ే, అక్కడ ఒక కంపెనీ నడుస్తున్నట్లుకానీ, దాని డైరెక్టర్ల గురించి కానీ తెలియదని అక్కడున్న వారు చెప్పారు. అంటే, నలుపును తెలుపు చేసుకునేందుకు కొందరు సృష్టించిందనేది తేలిపోయింది. కేంద్ర ఆదాయపు పన్ను శాఖ హింగోరాతోపాటు కొన్ని వందల షెల్ కంపెనీలపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది.
భాస్కర్ ఫండ్ మేనేజ్మెంట్, డెల్టన్ ఎగ్జిమ్ ప్రైవేట్ లిమిటెడ్, క్లిఫ్టన్ పియర్సన్ ఎక్స్పోర్ట్స్, గంగా బిల్డర్ కంపెనీ వంటి ఏడు కంపెనీలతో రాజకీయ వారసులు సంబంధాలు పెట్టుకున్నట్లు ఐటీ గుర్తించినట్లు తెలుస్తోంది. వీటిలో భాస్కర్, డెల్టన్, క్లిఫ్టన్ కంపెనీలు కోల్కతాలోని న్యూ అలీపూర్లో ఒకే చిరునామాలో ఉన్నాయి. అక్కడ పరిశీలిచగా, వందల కోట్లు పెట్టుబడులు పెట్టే స్థాయి వీటికి లేదని ఇట్టే తేలిపోతుంది. వాటిని అద్దె ఇళ్లలో తెరిచేశారు. ఈ మూడు కంపెనీల్లో నవ కుమార్ అనే వ్యక్తి డైరెక్టర్గా ఉన్నారు.
భాస్కర్ ఫండ్ మేనేజ్మెంట్, డెల్టన్ కంపెనీలు వైఎస్ జగన్ నడుపుతున్న 'జగతి పబ్లికేషన్స్'లోనూ భారీగా పెట్టుబడులు పెట్టినట్లు సమాచారం. భాస్కర్ ఫండ్ మేనేజ్మెంట్ లిమిటెడ్కు ఢిల్లీలోని ఆకృతి హోటల్స్లో 15వేల షేర్లు ఉన్నాయి. ఇదే హోటల్లో మాయావతి సోదరుడు ఆనంద్ కుమార్కు అందులో 65వేల షేర్లు ఉన్నాయి.
ఆకృతి హోటల్స్లో 37 మంది షేర్ హోల్డర్లు ఉన్నప్పటికీ పెత్తనమంతా ఆనంద్ కుమార్దేనని తెలుస్తోంది. డెల్టన్ ఎగ్జిమ్ ప్రైవేట్ లిమిటెడ్, భాస్కర్ ఫండ్ మేనేజ్మెంట్ కంపెనీల కార్యాలయాలను కొన్ని రోజుల క్రితం న్యూఅలీపూర్లో మూతవేసి, మరో చోట తెరిచారు. మొత్తం మీద, మాయావతి సోదరుడు సంపద పోగుచేసుకోవడంలో పెద్ద వ్యవహారమే నడిచినట్లు చెబుతున్నారు.