ఎన్టీఆర్ ఒక్కరే కాదు..వైయస్సారే ముందుగా..: అదే ఇప్పడు జగన్ అనుసరిస్తున్నారు: ఇదీ నిజం..!
Recommended Video
రూపాయి జీతం. ఇప్పటి వరకు ఎన్టీఆర్ ఒక్కరే ముఖ్యమంత్రిగా రూపాయి జీతం తీసుకున్నారనే విషయం ప్రచారంలో ఉంది. ఏపీ కొత్త ముఖ్యమంత్రిగా జగన్ సైతం అదే తరహాలో ఎన్టీఆర్ను అనుసరిస్తున్నారని చెబుతున్నారు. అయితే, ఇక్కడ జగన్ అనుసరిస్తుంది ఎన్టీఆర్ను కాదు..తన తండ్రి వైయస్సార్ను. వైయస్సార్కు రాజకీయాల్లోకి రాకుముందే రూపాయి డాక్టర్గా పులివెందుల-జమ్మలమడుగులో పేరుంది. ఇదే సమయంలో వైయస్సార్కు మరో ప్రత్యేకత ఉంది. అదే ఇప్పుడు జగన్కు స్పూర్తి. ఇప్పటి వరకు చాలా మందికి తెలియని విషయం ఏంటంటే..
రూపాయి వైద్యుడిగా వైయస్సార్..
వైయస్ రాజశేఖర రెడ్డి వృత్తి రీత్యా వైద్యులు. ఆయన గుల్బర్గా కాలేజీలో వైద్య విద్య పూర్తి చేసిన తరువాత జమ్మలమడుగు..పులివెందులలో వైద్య సేవలు ప్రారంభించారు. ఆ సమయంలో ఆయన రూపాయి వైద్యుడిగానే ఖ్యాతి గడించారు. ఇక, రాజకీయాల్లోకి వచ్చిన తరువాత సైతం ఆయనకు ఆ రూపాయితోనే పేరు కొనసాగింది. 1973లో సొంత గ్రామం అయిన పులివెందులో తన తండ్రి పేరు మీద 70 పడకల ఆస్పత్రిని స్థాపించి ఉచిత వైద్యం అందిచంటం ప్రారంభించారు. నామ మాత్రంగా రూపాయి మాత్రమే ఫీజుగా తీసుకొనే వారు. ఇక, 1978లో వైయస్సార్ రాజకీయాల్లోకి ప్రవేశించారు. తొలి సారిగా పులివెందుల నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అదే సమయంలో చంద్రబాబు సైతం చంద్రగిరి నుండి ఎమ్మెల్యేగా గెలిచారు.
రూపాయి మంత్రిగా..
ఇక, ఎమ్మెల్యేలుగా ఎన్నికై ఈ ఇద్దరు నాటి ముఖ్యమంత్రి అంజయ్య కేబినెట్లో మంత్రులయ్యారు. అప్పుడు చంద్రబాబు సినిమా ఆటోగ్రఫీ మంత్రిగా ఉన్నారు. 1980లో వైయస్ రాజశేఖర రెడ్డి అదే కేబినెట్లో వైద్య ఆరోగ్య శాఖా సహాయ మంత్రి అయ్యారు. ఆ రోజుల్లో రాష్ట్రం కరువుతో అల్లాడుతున్న సమయం. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతం దుర్భిక్ష్యంతో అల్లాడింది. దీంతో..వారికి అండగా నిలవాలనే సంకల్పంతో కీలక నిర్ణయం తీసుకున్నారు. తాను ఆ ప్రాంతానికి చెందిన వాడిగా అక్కడి పరిస్థితులను కళ్లారా చూసి..ఆ నిర్ణయం తీసుకున్నారు. మంత్రిగా తనకు వచ్చే జీత-భత్యాలను వదులుకున్నారు. కేవలం మంత్రిగా రూపాయి మాత్రమే వేతనం తీసుకున్నారు. అదే కేబినెట్లో అదే ప్రాంతానికి చెందిన మంత్రిగా ఉన్న చంద్రబాబు మాత్రం ఇలా చేయలేక పోయారు. దీంతో..నాటి సీఎం అంజయ్య తన మంత్రి వైయస్ను అభినందించారు.
నేడు అదే బాటలో జగన్..
ఏపీ నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన జగన్ సైతం అదే బాటను అనుసరిస్తున్నారు. జగన్ సైతం ముఖ్యమంత్రిగా రూపాయి జీతమే తీసుకోవాలని నిర్ణయించారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా అమలు చేస్తే దీని కంటే ముందుగానే వైయస్సార్ రూపాయి జీతం ప్రారంభించారు. ఎన్టీఆర్ 1983లో అధికారంలోకి వచ్చిన తరువాత ఈ నిర్ణయం అమలు చేసారు. రూపాయి వైద్యుడిగా.. రూపాయి మంత్రిగా..ఇప్పుడు ఆయన తనయుడు రూపాయి సీఎంగా కొనసాగనున్నారు. ఇప్పుడు పులివెందుల వాసులు..వైయస్ సన్నిహితులు ఈ విషయాన్ని వెలుగులోకి తెస్తున్నారు.