కేంద్రం పై యుద్దం కాదు.!కనువిప్పు కలిగించే ప్రయత్నం.!అందుకే ఢిల్లీలో ఆ రోజు దీక్ష.! బాబు
అమరావతి/ హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ పట్ల ప్రధాని మోదీ నిర్లక్ష్య వైఖరి దేశ వ్యాప్తంగా తెలియజెప్పేందుకే ఈ నెల 11న ఢిల్లీలో నిరశన దీక్ష చేపట్టినట్టు, ఏపి కి జరుగుతున్న అన్యాయం గురించి దేశవ్యాప్తంగా చర్చ జరగాలని టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్న ధర్మపోరాట ధీక్షలను ఢిల్లీలో కూడా చేయాలని ఆయన నిర్ణయించారు. అఖిలపక్ష సమావేశంలో ఈ మేరకు తన నిర్ణయాన్ని ఆయన వెల్లడించారు.
ఈ నెల 11న ఢిల్లీ లో దీక్ష..! కేంద్రం కళ్లు తెరిపిస్తామంటున్న బాబు..!!
ఫిబ్రవరి 11వ తారీఖున ఢిల్లీలో, ముఖ్యమంత్రి హోదాలో, ఏపీకి జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ ఒకరోజు దీక్ష చేపట్టునున్నట్లు ప్రకటించారు. ఆయన నిర్ణయాన్ని అఖిల పక్ష నేతలంతా ఆమోదించారు. ఢిల్లీలో సీఎం దీక్షకు సంఘీభావంగా పిబ్రవరి 1వ తారీఖు నుంచి 13వ తారీఖు వరకు రాష్ట్రంలో వివిధ రూపాల్లో కేంద్రానికి నిరసనలు తెలపాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.
రాష్ట్ర ప్రయోజనాల గురించి వైసీపి వైఖరి చెప్పాలి..! డిమాండ్ చేస్తున్న టీడిపి..!
దీనికోసం అఖిలపక్షం తరపున కమిటీని వేయాలని సూచించారు. టీడిపి ఆద్వర్యంలో జరిగిన అఖిలపక్ష సమావేశానికి వైసీపీ గైర్హాజరయింది. ఇటీవల మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్ నిర్వహించిన అఖిలపక్షాన్ని కూడా వైసీపీ బహిష్కరించిన సంగతి తెలసిందే. దీంతో రాష్ట్ర ప్రయోజనాల విషయంలో వైసీపీ వ్యవహరిస్తున్న వైఖరి గురించి కూడా ఈ సమావేశంలో చర్చ జరిగినట్లు సమాచారం.
ప్రతిపక్ష పార్టీ ద్వంద్వ వైఖరి..! దిగజారుడు రాజకీయాలు వద్దన్న టీడిపి..!!
తెలుగుదేశం పార్టీ పైన ఉన్న ద్వేషంతో రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై కలిసి పోరాడేందుకు వైసీపీ ముందుకు రావడం లేదని ఈ సందర్భంగా కొందరు టీడిపి నేతలు అభిప్రాయపడ్డారు. రాజకీయాలను వ్యక్తిగతంగా తీసుకోవడం ఏమాత్రం మంచిది కాదని ఏపి టీడిపి నేతలు చెప్పుకొచ్చారు. ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ప్రభుత్వాన్ని నిలదీసి, పోరాటాలు చేయాల్సిన పార్టీయే ఇలా ముందే కేంద్ర ప్రభుత్వానికి దాసోహం అవ్వడం ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు.
బాబు ఒక రోజు దీక్ష..! జాతీయ పార్టీల మద్ధత్తు..!!
ఇదిలా ఉండగా చంద్రబాబు ఫిబ్రవరి 11న నిర్వహించనున్న దీక్షకు పెద్ద సంఖ్యలో జాతీయ పార్టీలు మద్ధతు పలికే అవకాశాలు ఉన్నాయి. కాంగ్రెస్ సహా పలు ప్రధాన పార్టీలు దీక్షా శిబిరం వద్దకు వచ్చి సంఘీభావం ప్రకటిస్తాయని టీడీపీ నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. డీఎంకే, ఎస్పీ, బీఎస్పీ, తృణమూల్ కాంగ్రెస్, కాంగ్రెస్, జేడీఎస్ వంటి పార్టీల నేతలు చంద్రబాబు దీక్షా శిబిరానికి వస్తారని చెబుతున్నారు. దీక్ష ద్వారా బీజేపీ చేసిన మోసాన్ని టీడీపీ జాతీయ స్థాయిలో ఎండగట్టబోతోందంటున్నారు టీడిపి నేతలు.