కాంగ్రెస్ , బీజేపీలకన్నా నోటా బెటర్ అన్న ఏపీ ప్రజలు .. జాతీయ పార్టీల పరువు గంగలో కలిసిందిగా
ఏపీ ఎన్నికల ఫలితాలు సంచలనం సృష్టించాయి. ఎవరూ అంచనా వెయ్యని, ఊహించని ఫలితాలు ఏపీలో ఇప్పటికీ చర్చనీయాంశంగా మారాయి. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెసు పార్టీల మధ్య పోటీ హోరాహోరీ ఉంటుందని అంచనా వేశారు. కానీ, తెలుగుదేశం పార్టీ చాలా ఘోరంగా దెబ్బ తింటుందని ఎవరూ ఊహించలేదు. కేవలం శాసనసభలో 23 సీట్లకు, లోకసభలో 3 సీట్లకు మాత్రమే పరిమితమై షాక్ లో ఉంది. తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఇలా ఉంటే ఇక కాంగ్రెస్, బీజేపీల పరిస్థితి వింటే జాతీయ పార్టీలకుఏపీ ప్రజలు ఇచ్చిన ప్రాధాన్యత ఏ పాటిదో తెలుస్తుంది.
చంద్రబాబు అప్పుడు 23 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేశాడు .. ఇప్పుడు 23 మందే గెలిచారన్న జగన్
ఏపీ ప్రజల తీర్పు.. జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ కన్నా నోటా బెటర్
రెండు జాతీయ పార్టీలైన కాంగ్రెసు, బిజెపిలకన్నా నోటా బెటర్ అని ఏపీ ప్రజలు తీర్పునిచ్చారు. ఇక ఈ రెండు పార్టీలకు నోటా కన్నా తక్కువ ఓట్లు పోలయ్యాయి. లోకసభ, శాసనసభ ఎన్నికలు, రెంటిలోనూ ఆ పార్టీల పరిస్థితి అదే. 25 లోకసభ స్థానాల్లో నోటాకు 1.5 శాతం ఓట్లు పడ్డాయి. బిజెపికి కేవలం 0.96 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. కాంగ్రెసుకు మాత్రం 1.29 శాతం ఓట్లు వచ్చాయి. రాష్ట్రంలోని 175 శాసనసభ స్థానాల్లో నోటాకు 1.28 శాతం ఓట్లు పడగా, బిజెపికి 0.84 శాతం, కాంగ్రెసుకు 1.17 శాతం ఓట్లు పోలయ్యాయి.
కనీసం రాష్ట్ర అధ్యక్షులు కన్నా , రఘువీరా కు సైతం దక్కని డిపాజిట్లు
ఒక పక్క దేశం అంతా బీజేపీ ప్రభంజనంలా వస్తే ఏపీలో డిపాజిట్లు కోల్పోయింది బీజేపీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిస్థితి బిజెపి కన్నా కాంగ్రెస్ కాస్త నయంగా ఉంది. ఇక కాంగ్రెస్ అభ్యర్థులు కూడా లోకసభ, శాసనసభ ఎన్నికల్లో డిపాజిట్లు కోల్పోయారు. ఆ అభ్యర్థుల్లో బిజెపి రాష్ట్రాధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ, కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి కూడా ఉన్నారు. నర్సారావు పేట లోకసభ స్థానం నుంచి పోటీ చేసిన కన్నా లక్ష్మినారాయణ మూడో స్థానంలో నిలిచారు. కల్యాణదుర్గం శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన రఘువీరా రెడ్డి కూడా మూడో స్థానంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
ఏపీలో రోజు రోజుకూ దిగజారుతున్న జాతీయ పార్టీల పరిస్థితి
రాష్ట్ర విభజనతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెసు పార్టీ తుడిచిపెట్టుకు పోయింది. అయితే, 2014 ఎన్నికల్లో కాంగ్రెసుకు 2.8 శాతం ఓట్లు వచ్చాయి. కాంగ్రెసు పరిస్థితి నానాటికీ దిగజారుతున్నట్లు కనిపిస్తోంది. ఇక బీజేపీ కూడా ఏపీ ప్రజల ఆకాంక్ష అయిన ప్రత్యేక హోదా ఇవ్వంకుండా ఇబ్బంది పెడుతున్న కారణంగా ఏపీ ప్రజలు బీజేపీని సైతం ఆదరించలేదు. ఈ రెండు జాతీయ పార్టీల కంటే నోటా బెటర్ అని భావించి నోటాకు ఎక్కువ ఓట్లేశారు.