పంచాయతీ పోలింగ్లో కీలక మార్పు: తొలిసారిగా ఆ వ్యవస్థ ఇంట్రడ్యూస్: అభ్యర్థులపై
అమరావతి: రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల వేడి పతాక స్థాయికి చేరుకుంటోంది. ఇప్పటికే జగన్ సర్కార్..ఎన్నికల కమిషన్ కార్యాలయం మధ్య కొనసాగుతోన్న విభేదాలు మాటల యుద్ధానికి తోడుగా స్థానిక రాజకీయాలు జత కానున్నాయి. నామినేషన్ల పర్వం ముగియబోతోండటంతో అందరి కళ్లూ ఏకగ్రీవాల మీదే నిలిచాయి. నామినేషన్లను ఉపసంహరించుకోవడానికి అన్ని రాజకీయ పార్టీలు కూడా తమ ప్రత్యర్థులపై ఒత్తిళ్లను తీసుకొస్తున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఫిబ్రవరి 9వ తేదీన నిర్వహించబోయే పంచాయతీ పోలింగ్ ఎలాంటి ఫలితాలను ఇస్తుందనేది ఆసక్తికరంగా మారింది.
ఈ సారి పంచాయతీ ఎన్నికల్లో సరికొత్తగా నోటా (నన్ ఆప్ ద అబౌ)ను ప్రవేశపెట్టబోతోంది రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయం అధికారులు. పంచాయతీ ఎన్నికల పోలింగ్లో ఈ వ్యవస్థను ప్రవేశపెట్టడం ఇదే తొలిసారి. ఇప్పటిదాకా నోటా.. లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల పోలింగ్కు మాత్రమే పరిమితమై ఉండేది. దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు దీన్ని స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇంట్రడ్యూస్ చేయబోతోన్నారు. సాధారణ ఎన్నికల సమయంలో పార్టీ అభ్యర్థుల గుర్తులతో పాటుగా చివర్లో నోటా సింబల్ను కూడా ముద్రిస్తుంటారు. ఈ సారి పంచాయతీ ఎన్నికల్లో కూడా నోటాను తీసుకుని రానున్నారు.
స్థానిక స్వపరిపాలనకు అద్దం పట్టే పంచాయతీ ఎన్నికల్లో నోటా వ్యవస్థను తప్పనిసరిగా ప్రవేశపెట్టాల్సి ఉంటుందంటూ ఇదివరకే సుప్రీంకోర్టు అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలకు ఆదేశాలను జారీ చేసిన విషయం తెలిసిందే. లోక్సభ, శాసనసభ తరహాలోనే తమకు ఏ అభ్యర్థీ నచ్చట్లేదనే అభిప్రాయాన్ని తెలియజేసే హక్కు ఓటర్లకు ఉందని పేర్కొంది. దీనికి అనుగుణంగా పంచాయతీల్లో నోటా వ్యవస్థను అమలు చేయనున్నారు. ఇదివరకు నిర్వహించిన కర్ణాటక, కేరళ స్థానిక సంస్థల ఎన్నికల్లో నోటాను అందుబాటులోకి తీసుకొచ్చారు. అదే విధానాన్ని పంచాయతీ ఎన్నికల్లో అనుసరించనున్నారు.