‘శ్రీశైలం ప్రాజెక్టుకు ఎలాంటి ప్రమాదం లేదు.. ఆందోళన వద్దు’
అమరావతి: శ్రీశైలం ప్రాజెక్టుకు ఎలాంటి ప్రమాదం లేదని డ్యాం పర్యవేక్షక ఇంజినీర్ చంద్రశేఖర్ రావు తెలిపారు. వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేంద్ర సింగ్ వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన ఈ మేరకు స్పందించారు. రాజేంద్ర సింగ్ చెప్పినట్లుగా శ్రైశైలం ఆనకట్టకు ఎలాంటి ప్రమాదం లేదని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ కనుమరుగే: 'శ్రీశైలం ప్రాజెక్టు'పై వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా హెచ్చరిక
సురక్షితమే..
శ్రీశైలం జలాశయం సురక్షితంగా ఉందని ఇప్పటికే సీడబ్ల్యూసీ నిర్ధరించినట్లు చంద్రశేఖర్ రావు చెప్పారు. ప్లంజ్ పూల్ సర్వే నివేదిక రాగానే... డ్యామ్ సేఫ్టీ కమిటీ ముందు పెడతామని ఆయన తెలిపారు. ప్రాజెక్టు నిర్వహణలో భాగంగా ప్రతి ఏడాది ఫ్లాంక్ ప్రొటెక్షన్ పనులు, గేట్ మెయింటనెన్స్ పనులు, గ్యాలరీ నిర్వహణ పనులు శ్రద్ధతో చేపడతామని అన్నారు. డ్యాం అధికారులు ఎప్పటికప్పుడు డ్యాంను పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. డ్యాం సాంకేతిక విషయంపై అధికారుల సలహాలతో తగు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు..
శ్రీశైలం ప్రాజెక్టు ప్రమాదంలో ఉందన్న వార్తలతో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ అన్నారు. శ్రైశైలం ప్రాజెక్టు సురక్షితంగానే ఉందని, ఎలాంటి ప్రమాదం లేదని ఆయన గురువారం వ్యాఖ్యానించారు. ప్రాజెక్టు రక్షణ కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. శ్రీశైలం ప్రాజెక్టు ప్రమాదంలో ఉందంటూ వస్తున్న వార్తలతో ప్రజలు ఎవరూ భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
పెను ముప్పు అంటూ వాటర్ మ్యాన్..
కాగా, శ్రీశైలం ప్రాజెక్టు ప్రమాదంలో పడిందని. వెంటనే మరమ్మతులు చేయకపోతే పెను విషాదం తప్పదని రాజేంద్ర సింగ్ హెచ్చరించారు. ప్రభుత్వాలు నదులపై ప్రాజెక్టులు నిర్మిస్తున్నాయే తప్ప వాటి నిర్వహణ బాధ్యతలు సరిగా చూసుకోవడం లేదని అన్నారు. ఏదైనా విపత్తు సంభవిస్తే ఆంధ్రప్రదేశ్ కనిపించకుండా పోతుందని రాజేంద్ర సింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. డ్యాం సమీపంలో నిర్మాణాలపై ప్రభుత్వం దృష్టి సారించాలని ఆయన కోరారు.
ప్రభుత్వాలు శ్రద్ధ పెట్టాలంటూ..
ప్రభుత్వం ఎంత త్వరగా చర్యలు చేపడితే శ్రీశైలం ప్రాజెక్టును అంత పరిరక్షించుకోవచ్చని రాజేంద్ర సింగ్ స్పష్టం చేశారు. గంగాజల్ సాక్షరత్ యాత్రలో భాగంగా రాజేంద్ర సింగ్ దేశ వ్యాప్తంగా పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన శ్రీశైలం ప్రాజెక్టును సందర్శించారు. ప్రమాదాన్ని ముందుగా గుర్తించి చర్యలు తీసుకుంటూనే పెను ప్రమాదాలు తప్పుతాయన్నారు. డ్యాం సందర్శన సందర్భంగా డ్యాం ఎస్ఈ చంద్రశేఖర్ రావును రాజేంద్ర సింగ్ కలివారు. డ్యాం సంరక్షణ చర్యలకు సుమారు రూ. 60 కోట్ల వరకు అవసరం అవుతాయన్నారు.