చంద్రబాబుకు నోటీసులు ముమ్మాటికీ తప్పే..ప్రజాపోరాటాలపై కేసులు సరికాదు:ఎపిసిసి ఛీప్ రఘువీరా
అనంతపురం: బాబ్లీ ప్రాజెక్టు కేసులో ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మహారాష్ట్ర ధర్మాబాద్ కోర్టు నోటీసులివ్వడాన్ని ఏపీసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి తప్పుబట్టారు.
బాబ్లీ ప్రాజెక్టుపై టిడిపి అధినేత చంద్రబాబు చేసిన పోరాటంపై కేసులు పెట్టడం, నోటీసులు జారీ చేయడం ముమ్మాటికీ తప్పేనని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి వ్యాఖ్యానించారు. ప్రజాపోరాటాలు చేస్తే కేసులు పెట్టడం సరికాదని, ఏపీలోనూ ఉద్యమాల్లో పాల్గొన్నవారిపై కేసులు ఎత్తివేయాలని ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఏపీలో ముందస్తు ఎన్నికలు రావని రఘువీరా అభిప్రాయపడ్డారు.
మరోవైపు బాబ్లీ కేసులో ఐదేళ్ల క్రితం ఛార్జిషీట్ వేశామని, చార్జిషీట్ వేశాక అంశం కోర్టు పరిధిలో ఉంటుందని నాందేడ్ ఎస్పీ ఖతార్ తెలిపారు. పోలీసులు, ప్రభుత్వ ఉద్యోగులను అడ్డుకున్నందుకు కేసు నమోదు చేశారని, మొత్తం 16 మందిపై చార్జిషీట్ వేశామని ఎస్పీ ఖతార్ వెల్లడించారు. వీరందరినీ 21న హాజరుపర్చాలని ధర్మాబాద్ కోర్టు ఆదేశించిందని, నాన్బెయిలబుల్ వారంట్ కోర్టు విచక్షణాధికారానికి చెందినదని ఖతార్ వ్యాఖ్యానించారు.
ఇదిలా వుండగా చంద్రబాబుకు నోటీసుల జారీ పై టిడిపి నేతలు మండిపడుతున్నారు. మోడీ పాలన చూస్తుంటే హిట్లర్ పాలన గుర్తుకు వస్తుందని టీడీపీ ప్రధాన కార్యదర్శి, ఆర్టీసీ ఛైర్మన్ వర్ల రామయ్య ఆరోపించారు. ఏ తప్పు చేశారని చంద్రబాబుకు నోటీసులు జారీ చేశారని వర్ల రామయ్య ప్రశ్నించారు. ధైర్యం ఉంటే చంద్రబాబు అరెస్ట్ చేసి తీసుకువెళ్లాలన్నారు.
ఆరు నెలలుగా మోదీ వ్యవహార శైలి సరిగ్గా లేదని వర్ల రామయ్య తప్పుబట్టారు. ఎమర్జెన్సీ సమయంలో ఇందిరా గాంధీ కూడా ఈ విధంగా చేయలేదని వర్ల రామయ్య దుయ్యబట్టారు. చంద్రబాబుపై ఈగ వాలినా ప్రధాని మోడీదే బాధ్యత అని వర్ల రామయ్య తీవ్రంగా హెచ్చరించారు.
ఇదిలావుంటే చంద్రబాబుకు కోర్టు నోటీసులపై బిజెపి ఎమ్మెల్యే విష్ణుకుమార్రాజు విభిన్నంగా స్పందించారు. చంద్రబాబుకు నాన్బెయిలబుల్ వారెంటు జారీ కావడాన్ని కొందరు స్వార్ధపరులు రాజకీయం చేస్తున్నారని, అది సరికాదన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబుకు వారెంటు వస్తే అది ఆపరేషన్ గరుడలో భాగంగానే వచ్చిందనుకోవడం సరైన పద్ధతి కాదన్నారు.
ప్రజల కోసం పోరాటం చేసినందుకు చంద్రబాబుకు నాన్బెయిలబుల్ వారెంటు వచ్చినంత మాత్రాన ఆయన ప్రతిష్ఠకు ఏమీ భంగం వాటిల్లదని విష్ణుకుమార్ రాజు వ్యాఖ్యానించారు. చట్టం తన పని తాను చేసుకుపోవడం సహజమేనని, కానీ కొందరు వీటిని పనిగట్టుకొని రాద్ధాంతం చేస్తున్నారని, ఇలాంటి తప్పుడు ప్రచారాలు మానుకోవాలని విష్ణుకుమార్ రాజు హితవు పలికారు.