ఆసనాల విన్యాసాలకు చెక్..! మంతెన సత్యనారాయణ ఆశ్రమానికి నోటీసులు జారీ..!!
అమరావతి/హైదరాబాద్ : ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందంటే ఇదే.. కృష్ణా నది వెంట వీచే చల్లని పిల్లగాలుల మద్య యోగా ఆసనాలు వేసుకునే మంతెన రాజుగారికి కష్టాలు ఎదురయ్యాయి. కరకట్టపై ఉన్న మంతెన సత్యనారాయణ రాజు ఆశ్రమానికి సీఆర్డీఏ అధికారులు నోటీసులు జారీ చేశారు. నోటీసులపై ఆశ్రమ నిర్వాహకులు హైకోర్టును ఆశ్రయించారు. సీఆర్డీఏ నోటీసులపై ఈనెల 16న హైకోర్టు విచారించింది. నాలుగు వారాలు గడువివ్వాలని సీఆర్డీఏకు హైకోర్టు సూచించింది.
అయితే నోటీసుల జారీ చేసిన వ్యవహారాన్ని సీఆర్డీఏ అధికారులు గోప్యంగా ఉంచారు. అలాగే కరకట్ట పక్కనే నిర్మించిన ఆరోగ్యాలయంలో కూడా నిబంధనలు ఉల్లంఘించారని సీఆర్డీఏ నోటీసులు జారీ చేసింది. నిర్మాణాలను కూల్చేస్తామని నోటీసుల్లో పేర్కొంది. సీఆర్డీఏ నోటీసులపై నిర్వాహకులు హైకోర్టును ఆశ్రయించారు. నిర్వాహకుల వివరణకు నాలుగు వారాలు గడువివ్వాలని హైకోర్టు ఆదేశించింది. వివరణ తర్వాత చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని సీఆర్డీఏకి హైకోర్టు సూచించింది.
ఈ నెల 16నే హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఉండవల్లిలోని ప్రజావేదికను నిబంధనలను తుంగలో తొక్కి అక్రమంగా, అవినీతిగా నిర్మించారంటూ దాన్ని కూల్చివేయాలంటూ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇప్పటికే ఆ భవనాన్ని సీఆర్డీఏ అధికారులు కూల్చివేయడం జరిగింది.
ఇదిలా ఉండగా అక్రమ కట్టడాల జాబితాలో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసం ఉంటున్న భవనం కూడా ఉన్నట్లు తేలింది. దీంతో చంద్రబాబుకు కరకట్టలోని ఆయన నివాసానికి వెళ్లిన సీఆర్డీఏ అధికారులు నోటీసులు ఇచ్చారు. నోటీసులు జారీ చేసేందుకు సీఆర్డీఏ అసిస్టెంట్ డైరెక్టర్ నరేందర్ రెడ్డి.. బాబు నివాసానికి కాసేపటి క్రితం చేరుకుని నోటీసులు ఇచ్చారు.
ఇళ్లు ఖాళీ చేయించి పడగొట్టాలని లేనిపక్షంలో ప్రభుత్వమే కూల్చివేస్తుందని నోటీసుల్లో అధికారులు పేర్కొన్నట్లు సమాచారం. అంతేకాదు వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని సీఆర్డీఏ అధికారులు ఆదేశించారు. నోటీసులకు వివరణ ఇవ్వకపోతే భవనాలు తొలగిస్తామని అధికారులు స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే ప్రముఖ పారిశ్రామికవేత్త లింగమనేని రమేష్ అతిథి గృహాన్ని.. 2014లో టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన అనంతరం తన నివాసం మార్చుకుని.. జడ్ ప్లస్ కేటగిరి భద్రతకు అనుకూలంగా మార్పులు చేర్పులు చేసిన సంగతి తెలిసిందే.
అంతేకాదు లింగమనేని నివాసానికి నోటీసులు అంటించి అధికారులు వెనుదిరిగారు. మీడియాకి దూరంగా అత్యంత గోప్యంగా నోటీసులు ఇచ్చే కార్యక్రమన్ని అధికారులు నిర్వహించారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం ఉంటున్న లింగమనేని నివాసానికి మాత్రమే నోటీసులు ఇచ్చి వెళ్లిపోయారు సీఆర్డీఏ అధికారులు.