నోటీసులిచ్చింది చంద్రబాబుకా ... ఎందుకీ రాద్ధాంతం అంటున్నఆర్కే
ఏపీలో కృష్ణా నది కరకట్ట వెంట ఉన్న అక్రమ నిర్మాణాల కూల్చివేత రాష్ట్రంలో రాజకీయ వేడిని మరింత పెంచింది. ప్రజావేదిక కూల్చేసిన జగన్ సర్కార్ కరకట్ట మీద ఉన్న ఇతర నిర్మాణాలకు కూడా నోటీసులు పంపించింది. అందులో భాగంగా ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు నివాసం లింగమనేని ఎస్టేట్కు సీఆర్డీఏ నోటీసులు జారీ చేసింది. సీఆర్డీఏ అడిషనల్ డైరెక్టర్ నరేందర్ రెడ్డి స్వయంగా లింగమనేని ఎస్టేట్కు వెళ్లి అక్కడి గోడ మీద నోటీసులు అంటించారు. దీంతో తెలుగుదేశం పార్టీ నేతలు జగన్ సర్కార్ కక్ష పూరితంగానే ఇదంతా చేస్తుందని ఆరోపిస్తున్నారు. ఇక దీనికి సమాధానంగా మంగళగిరి ఎమ్మెల్యే, సీఆర్డీయే చైర్మన్ ఆళ్ళ రామకృష్ణా రెడ్డి ఫైర్ అయ్యారు.
కృష్ణానది కరకట్ట వెంబడి అక్రమ నిర్మాణాలన్నింటికీ నోటీసులు
నదీ గర్భంలో నిర్మించిన లింగమనేని ఎస్టేట్.. నదుల పరిరక్షణ చట్టాన్ని ఉల్లంఘించి నిర్మించారని అందుకే అది అక్రమ కట్టడమని పేర్కొని చంద్రబాబు నివసిస్తున్న ఇంటికి నోటీసులు అంటించారు సీఆర్డీయే అధికారులు . అంతేకాదు నోటీసులపై వివరణ ఇచ్చి 7 రోజుల్లోగా స్వచ్చందంగా భవనాలను నిర్మూలించాలని నోటీసుల్లో ఆదేశించారు. లేనిపక్షంలో సీఆర్డీఏ చర్యలకు దిగుతుందని తెలిపారు.కృష్ణా నది కరకట్ట వెంబడి ఉన్న అక్రమ నిర్మాణాలన్నింటికీ అధికారులు నోటీసులు జారీ చేశారు. చంద్రబాబు నివాసంతో పాటు మరో 20 అక్రమ నిర్మాణాలకు నోటీసులు జారీ చేసినట్టు సమాచారం. అక్రమ నిర్మాణాలను ఉపేక్షించేది లేదని కలెక్టర్ల సదస్సులో తేల్చి చెప్పిన జగన్ చెప్పినట్టుగానే ఆ దిశగా ముమ్మర చర్యలు తీసుకుంటున్నారు. అక్కడ ఉన్న అక్రమ నిర్మాణాలన్నింటికీ నోటీసులు జారీ చేశారు.
చంద్రబాబు నివాసానికి రోడ్ ఇచ్చిన రైతులతో కలిసి భూములు పరిశీలించిన ఆర్కే
ఇటీవల ఎన్నికల్లో టీడీపీ ఓటమి పాలవడం, ప్రభుత్వం మారిన నేపథ్యంలో చంద్రబాబు నివాసానికి వెళ్ళటానికి రోడ్డు కోసం ఇచ్చిన తమ భూములు ఇచ్చేయాలంటూ రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రైతులతో కలిసి ఆర్కే ఆ భూములను పరిశీలించారు సీఆర్డీయే చైర్మన్ ఆళ్ళ రామకృష్ణా రెడ్డి . ఈ సమయంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మాజీ సీఎం చంద్రబాబు నివాసం విషయంలో తెలుగు తమ్ముళ్ళు అనవసరపు రాద్దాంతం చేస్తున్నారని ,నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన గెస్ట్ హౌస్కు నోటీసులు ఇస్తే లింగమనేని రమేశ్ ఎందుకు స్పందించటం లేదని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రశ్నిస్తునారు .
లింగమనేని గెస్ట్ హౌస్ కి నోటీసులిస్తే మీ రాద్దాంతం ఏంటి ? లింగమనేని ఎందుకు స్పందించరు అని ప్రశ్నించిన ఆర్కే
లింగమనేని గెస్ట్ హౌస్కు నోటీసులు ఇస్తే పచ్చ మీడియా, టీడీపీ చంద్రబాబుకు నోటీసులు ఇచ్చినట్టు తెగ రాద్ధాంతం చేస్తున్నాయని ఆయన ఫైర్ అయ్యారు . ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు లింగమనేని గెస్ట్ హౌస్ ను లీజుకు తీసుకుని తన నివాసంగా మార్చుకున్నారు. ఇక మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసానికి వెళ్లేందుకు రోడ్డు నిర్మాణం కోసం రైతుల నుండి భూములు తీసుకున్నారు. ముఖ్యమంత్రి పదవి పూర్తయిన తర్వాత తమ భూములు అప్పగిస్తామంటూ రహదారి నిర్మాణం కోసం రైతులు శేషగిరిరావు, దాసరి సాంబశివరావు నుంచి అధికారులు భూమిని తీసుకుని ఆ మేరకు 2015లో ఒప్పంద పత్రం రాసిచ్చారు. ఇక భూములు ఇచ్చిన రైతులు తమకు న్యాయం చేయాలని కోరుతూ ఆర్కేను ఆశ్రయించారు. ఇక ఈ అక్రమ కట్టడాల విషయంలోనే ఆర్కే కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.