చోరీల డబ్బుతో సినిమా తీశాడు: కోట్లకు పడగలెత్తిన మురుగన్
చిత్తూరు: అంతర్రాష్ట్ర దోపిడీదొంగ, తమిళనాడు రాష్ట్రం తిరువారూర్ గ్రామానికి చెందిన బాలమురుగన్ను ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నారు. బాలమురుగన్.. ఏపీ, తమిళనాడు సహా కర్ణాటకల్లోని పలు బ్యాంకులు, ఇళ్లలో చోరీలకు పాల్పడి కోట్లలో నగదు, భారీ ఎత్తున ఆభరణాలను దోచుకోవడమే కాకుండా ఆ నగదును తెలుగు పరిశ్రమలో పెట్టుబడులు పెట్టి సినిమాలు తీస్తున్నట్టు పోలీసులు చెప్పారు.
కొన్నాళ్లుగా ఇతని కోసం గాలిస్తున్న చిత్తూరు జిల్లా పోలీసులు తమిళనాడులోని తిరువాయూర్ వద్ద బాలమురుగన్ను అదుపులోకి తీసుకున్నారు. కోట్లకు పడగలెత్తడమే తన ధ్యేయమని విచారణలో మురుగన్ వివరించినట్టు తెలిపారు. కాగా, ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ‘మనసా వినవే' చిత్రానికి మురుగన్ నిర్మాతగా వ్యవహరిస్తున్నట్టు వెల్లడించారు.
మంగళవారం పుత్తూరు డీఎస్పీ నాగభూషణరావు ఈ మేరకు వివరాలను మీడియాకు వెల్లడించారు. తమిళనాడుకు చెందిన బాలమురుగన్ 18 ఏళ్ల వయసులో తన ఇంట్లో ఉన్న టేప్రికార్డర్ను తానే కిటికీ తలుపులు తొలగించి దొంగతనం నేర్చుకుని కాలక్రమేణా అనేక నేరాలకు పాల్పడినట్లు తమ విచారణలో తెలిసిందన్నారు.
ఆయా కేసుల్లో జైలుకి వెళ్లిన మురుగన్కి దినకరన్ అనే మరో దొంగతో పరిచయం ఏర్పడిందని చెప్పారు. దినకరన్ దగ్గర మురుగన్ ఇళ్లలో దొంగతనాలు చేయడం నేర్చుకున్నాడని తెలిపారు. తమిళనాడులో 80, కర్ణాటకలో 30 ఇళ్లలో దొంగతనాలకు పాల్పడిన కేసులు మురుగన్పై నమోదై ఉన్నాయన్నారు.
మరోపక్క, 2014 నవంబర్ 16న చిత్తూరు జిల్లా వరదయ్యపాళెంలోని సప్తగిరి గ్రామీణ బ్యాంకులో జరిగిన రూ.2 కోట్ల్లకుపైగా నగదు, పెద్దమొత్తంలో నగల చోరీ కూడా మురుగనే చేసినట్టు నాగభూషణరావు చెప్పారు. ఇతని దగ్గర నుంచి 796 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు.
దోపిడీలు, దొంగతనాలకు మురుగన్ పక్కా ప్రణాళికలు వేసుకునే వాడని చెప్పారు. దొంగదోపిడీలతో సంపాదించిన డబ్బును సినీ రంగంలో పెట్టుబడులుగా పెట్టి కోట్లకు పడగలెత్తొచ్చని భావించాడు మురుగన్. దీంతో అధిక మొత్తంలో దొంగతనం చేయాలని, దీనికి బ్యాంకులే సరైనవని నిర్ణయించుకుని వాటిలో చోరీలకు పాల్పడడం ప్రారంభించాడు.
ఈ క్రమంలో తాను దోపిడీ చేయాలనుకునే బ్యాంకుల గురించి మొత్తం సమచారం సేకరించేవాడు. మొదట తెలంగాణలోని ఘటకేసర్ గ్రామీణ బ్యాంక్లో 2014 అక్టోబర్లో దోపిడీకి పాల్పడ్డాడు. ఈ బ్యాంకు నుంచి రూ.35 లక్షలు దోచుకున్నాడు. అనంతరం వరదయ్యపాళెంలో సప్తగిరి గ్రామీణ బ్యాంకులో దోపిడీకి పాల్పడ్డాడని డీఎస్పీ తెలిపారు.
బ్యాంకు దోపిడీలకు పాల్పడే సమయంలో గ్యాస్ కట్టర్లు, ఆక్సిజన్ సిలిండర్లను ఉపయోగించి లాకర్లను పగులగొట్టేవాడని వివరించారు. ఆ తర్వాత, కర్ణాటకలోని మరో 4 బ్యాంకుల్లో కూడా దోపిడీలు చేసినట్లు చెప్పారు. దోపిడీ చేసిన డబ్బు రూ. 7కోట్లతో తెలుగులో ‘మనసా వినవే' అనే సినిమాకు నిర్మాతగా మారి 70శాతం సినిమా కూడా పూర్తి చేసినట్లు తెలిపారు.
నిరక్షరాస్యుడైన బాలమురుగన్ దొంగతనాల్లో మాత్రం ఆరితేరాడని డీఎస్పీ నాగభూషణరావు వివరించారు. నిందితుడి నుంచి 796 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నామని డీఎస్సీ వెల్లడించారు. సమావేశంలో సీఐ నరసింహులు, వరదయ్యపాళెం ఎస్సై షేక్షావలి, సిబ్బంది పాల్గొన్నారు.