ప్రముఖ నవలా రచయిత కాకాని చక్రపాణి ఇక లేరు
ప్రముఖ నవలా రచయిత కాకాని చక్రపాణి తుదిశ్వాస విడిచారు. ఆయన పలు నవలలు, కథలు రాశారు. కాలమిస్టుగా పనిచేశారు.
హైదరాబాద్: ప్రముఖ నవలా రచయిత కాకాని చక్రపాణి సోమవారం తెల్లవారు జామున తుదిశ్వాస విడిచారు. ఆయన నవలలు మాత్రమే కాకుండా కథలు రాశారు. అనువాదాలు చేశారు. ఆంధ్రభూమి దినపత్రికలో 'కథలు -కాకరకాయలు' శీర్షిక పేరుతో అనేక సంవత్సరాలు కాలమ్ నిర్వహించారు. వృత్తి రీత్యా ఆయన ఆంగ్లోపన్యాసకులు
కాకాని చక్రపాణి పరిషత్ ప్రాచ్య కళాశాలలో ఆంగ్లోపన్యాసకులుగా పని చేసారు. వేగుచుక్క, ఏడడుగులు, గోరంత దీపం, నూరు శిశిరాలు, ది ఘోస్ట్, నువ్వు నాకొద్దు, నిప్పు వంటి నవలలు, 'మనిషి' వంటి పలు కథా సంకలనాలు వెలువరించారు. పలు సాహిత్య విమర్శ వ్యాసాలు రాశారు. మధ్య యుగ ఆంధ్ర దేశం, గాంధీ అనంతర భారత దేశం, కుతుబ్ షాహీలు వంటి గ్రంధాలకు సహ రచయితగా వ్యవహరించారు.
1942 ఏప్రెల్ 26 న కాకాని లో శ్రీరాములు, వెంకట సుబ్బమ్మ దంపతులకు జన్మించారు. కాకాని చక్రపాణి మంగళగిరి సి.కె.హైస్కూల్ లో ప్రాథమిక విద్య చదివి, అనంతరం గుంటూరు లో విద్యాభాసం చేసారు. 22 డిసెంబర్ 1966 లో సావిత్రితో వివాహం జరిగింది. ఆయనకు ఇద్దరు కుమారులు. 1993 లో సావిత్రి మరణానంతరం 1999 లో పునర్వివాహం చేసుకుని ఆదర్శంగా నిలిచారు.
1970 లో ఇంటి నుంచి తిరుపతికి 600 కిలోమీటర్లు కాలి నడకన ప్రయాణించడం వారి జీవితంలో అత్యంత విశిష్టమైన రోజు. ఒకాకాని ఆకస్మిక మృతి పట్ల తెలంగాణా సాహితీ అధికార ప్రతినిధి కపిల రాంకుమార్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. సాహితీ రంగానికి కాకాని చేసిన సేవలను ఆయన కొనియాడారు.