జగన్ కు నవంబర్ 1 టెన్షన్ .. సీబీఐ కోర్టులో వ్యక్తిగత హాజరు మినహాయింపుపై తీర్పు నేడే
సీఎం జగన్ వ్యక్తిగత హాజరు వ్యవహారంలో సిబిఐ ప్రత్యేక కోర్టు నేడు ఏమని తీర్పు చెప్పనుంది ? సీఎం జగన్మోహన్ రెడ్డికి వ్యక్తిగత హాజరుకు మినహాయింపునిస్తుందా ? లేక గతంలోలా జగన్ వేసిన పిటిషన్ను కొట్టేస్తుందా ? ఒకపక్క సిబిఐ సైతం గట్టిగా వాదనలు వినిపించిన నేపథ్యంలో ఇప్పుడు ఏ విధంగా ఉండబోతుంది అన్నది ఇప్పుడు తెలుగు రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది.
జగన్ అక్రమాస్తుల్లో ఉన్న ఐఏయస్ పై మరో కేసు: హైకోర్టు ఆదేశాల మేరకు: చిక్కుల్లో ఆ ముగ్గురు..!
వ్యక్తిగత హాజరు మినహాయిపు కోరుతూ జగన్ సీబీఐ ప్రత్యేక కోర్టులో పిటీషన్
అక్రమ ఆస్తుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి , ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా ఉన్న సమయంలో ప్రతి శుక్రవారం రోజు సిబిఐ ప్రత్యేక కోర్టుకు హాజరయ్యేవారు. అయితే సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన కోర్టుకు హాజరు కాలేనని తాను ఒక రాష్ట్రానికి సీఎంగా ఉన్నందున ముఖ్యమంత్రి హోదాలో కోర్టుకు హాజరు కావాలంటే అనవసరపు వ్యయం అవుతుందని పిటిషన్ దాఖలు చేశారు. వ్యక్తిగత హాజరు మినహాయింపు అనుమతినివ్వాలని కోర్టుకు విన్నవించారు.అయితే దీనిపై అటు జగన్ తరఫున, సీబీఐ తరఫున గట్టిగానే వాదనలు వినిపించారు. ఇక ఈ వ్యవహారంలో నేడు సీబీఐ ప్రత్యేక కోర్టు తీర్పు ఇవ్వనుంది. దీంతో జగన్ కోర్టుకు హాజరవుతారా ..? లేక జగన్ కు మినహాయింపు లభిస్తుందా అన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
సీఎం హోదాలో కోర్టుకు రావాలంటే 60 లక్షల రూపాయలు ఖర్చవుతుందన్న జగన్
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నిందితుడిగా ఉన్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి తన సీఎం అయినందువల్ల సీఎం హోదాలో చాలా పనులు ఉన్నాయని, అంతేకాకుండా తాను ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరయ్యేందుకు హైదరాబాద్ వస్తే తనకు సెక్యూరిటీ ప్రోటోకాల్ వంటి అంశాలకు రోజుకు 60 లక్షల రూపాయలు ఖర్చవుతాయని సిబిఐ ప్రత్యేక కోర్టుకు విన్నవించారు. ఇప్పటికే ఏపీ ఆర్థిక పరిస్థితి బాగోలేదు కాబట్టి తనకు కోర్టుకు రావడానికి వ్యక్తిగత మినహాయింపు ఇవ్వాలని అదనపు ఖర్చును నివారించాలని ఆయన కోర్టును కోరారు. తనకు కోర్టుకు రావడానికి అభ్యంతరం లేదని ఇప్పటికే ఆర్ధిక నష్టాల్లో ఉన్న రాష్ట్రానికి ఇది మరింత భారంగా మారి అవకాశముందని పేర్కొన్నారు.
సాక్షులను ప్రభావితం చేసే అవకాశం .. మినహాయింపు ఇవ్వొద్దన్న సీబీఐ
ఇక సీఎం జగన్మోహన్ రెడ్డి వేసిన వ్యక్తిగత మినహాయింపు పిటిషన్ ను సిబిఐ చాలా తీవ్రంగా వ్యతిరేకించింది. జగన్ పై ఉన్నది మామూలు అభియోగాలు కాదని, చాలా తీవ్రమైన ఆర్థిక నేరాలకు సంబంధించిన అభియోగాలని సిబిఐ తరఫు న్యాయవాది కోర్టులో వాదించారు. ఆయన ఎంపీగా ఉన్నప్పుడే సాక్షులను ప్రభావితం చేశారని, ఇక ఇప్పుడు సీఎం హోదాలో సాక్షిని మరింత ప్రభావితం చేయగలరని, అలాంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సిబిఐ తరఫు న్యాయవాది వాదించారు. కాబట్టి వ్యక్తిగత హాజరు మినహాయింపు ఇవ్వద్దని వారు తమ వాదనలు వినిపించారు.
ముగిసిన వాదనలు .. తీర్పు నేడే .. కొనసాగుతున్న ఉత్కంఠ
రెండు వారాల క్రితమే ఈ పిటిషన్ పై ఇరు వర్గాల వాదనలు హోరాహోరీగా జరిగాయి. గతంలో కూడా జగన్ మోహన్ రెడ్డి వ్యక్తిగత హాజరు మినహాయింపు కోరుతూ సిబిఐ కోర్టులో రెండుసార్లు పిటిషన్ వేసినా కోర్టు ఆ రెండు పిటిషన్లను కొట్టి వేసింది. ఆ తర్వాత హైకోర్టు కు వెళ్లినా అతడు కూడా ఆయనకు చుక్కెదురైంది. ఇక తరువాత మరోమారు సిబిఐ కోర్టులోనే పిటిషన్ వేసిన నేపథ్యంలో వాదనలు ముగిసి తీర్పు రిజర్వ్ లో ఉంది. ఇక నేడు తీర్పు వెలువడనున్న నేపథ్యంలో సిబిఐ కోర్టు ఏం చెప్తుంది? సీఎం జగన్ కు వ్యక్తిగత హాజరు మినహాయింపు ఇస్తుందా? లేక సీఎం జగన్ కోర్టుకు హాజరు కావాల్సి వస్తుందా అన్నది నేడు తేలనుంది.