ఇన్నాళ్లకు ఫసక్కు సరైన అర్థం: సర్జికల్ స్ట్రైక్స్పై మోహన్ బాబు, ఏయ్ పాకిస్తాన్.. రామ్ గోపాల్ వర్మ
హైదరాబాద్: పుల్వామా దాడికి ప్రతీకారంగా భారత్ మంగళవారం వేకువజామున పాకిస్తాన్లోకి చొచ్చుకెళ్లి ఉగ్రవాద స్థావరాలను నాశనం చేసింది. దీనిపై యావత్ భారత్ హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తోంది. పాకిస్థాన్ బాలాకోట్లోని జైష్ ఏ మహమ్మద్ ఉగ్రవాద సంస్థ కంట్రోల్ సెంటర్పై దాడిచేసిన భారత యుద్ధ విమానాలు 21 నిమిషాల్లో అపార నష్టం కలుగజేశాయి. భారత్ చర్యపై తమకు ప్రతిస్పందించే హక్కుందని, తగిన రీతిలో ప్రతిస్పందిస్తామని పాకిస్థాన్ విదేశాంగశాఖ మంత్రి షా మహ్మద్ ఖురేషీ చెప్పారు. భారత్ మాత్రం అమెరికాతో సహా పలు దేశాలతో సంప్రదించిన తర్వాత అన్ని చర్యలు తీసుకొని దాడి చేసింది.
ఈ దాడుల్లో 300 మందికి పైగా ఉగ్రవాదులు హతమైనట్లుగా తెలుస్తోంది. భారత్ నిర్వహించిన ఈ దాడులపై రాజకీయ, సినీ.. ఇలా అన్ని రంగాల్లోని ప్రముఖులు స్పందిస్తున్నారు. టాలీవుడ్ నటులు ఎన్టీఆర్, మహేష్ బాబు, మంచు విష్ణు, రామ్ చరణ్ తేజ, దర్శకులు రాజమౌళి ఇండియన్ ఎయిర్ ఫోర్స్కు సెల్యూట్ చేశారు.
సీనియర్ నటుడు మోహన్ బాబు కూడా తనదైన శైలిలో స్పందించారు. ఆయన తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చేసిన దాడిపై ఆసక్తికరంగా స్పందించారు. 'ఇన్నాళ్లకు ఫసక్ అంటే సరైన అర్థం లభించింది... ఫసక్కు నిజమైన అర్థం ఇదే... జైహింద్! పదండి ముందుకు!' అని ట్వీట్ చేశారు.
మోహన్ బాబు ఇటీవలి తన సినిమాలో పలికిన ఊతపదం ఫసక్. ఇది సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఫినిష్ అనే అర్థంలో దీన్ని నెటిజన్లు ఉపయోగించారు.. ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు మోహన్ బాబు తన డైలాగ్తోనే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దాడి పైన స్పందించారు.
రామ్ గోపాల్ వర్ స్పందన
పుల్వామా దాడిపై పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పైన ప్రముఖ దర్శకులు రామ్ గోపాల్ వర్మ వరుస ట్వీట్లతో ఏకిపారేశారు. ఇప్పుడు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దాడి పైన కూడా స్పందించారు. పీఓకేపై 'ఏయ్ పాకిస్థాన్, నువ్వు ఒకటి కొడితే మేము నాలుగు కొడతాం' అని ట్వీట్ చేశారు. మరో దర్శకుడు పూరీ జగన్నాథ్ స్పందిస్తూ... 'బుల్లెట్ దిగిందా లేదా?' అని ట్వీట్ చేశారు. భారత వైమానిక దళానికి సెల్యూట్.. జనగణమన అంటూ అభినందనలు తెలిపారు.