రూ.వందల కోట్లతో గాలి కూతురు పెళ్లి: 'అసలు ఐటీ శాఖ ఏం చేస్తోంది'
హైదరాబాద్: కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి కూతురు పెళ్లి దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. గాలి కూతురు పెళ్లి విషయమై సిపిఐ నేత రామకృష్ణ గురువారం నాడు స్పందించారు. ఆయన తన కూతురు పెళ్లి ఇలా చేస్తుంటే ఐటీ (ఆదాయపన్ను శాఖ) ఏం చేస్తోందని ప్రశ్నించారు. ఈ పెళ్లికి బీజేపీ నేతలు ఎలా వెళ్తారని ప్రశ్నించారు.
కాగా, తన కూతురు పెళ్లి వేడుకలను గాలి జనార్ధన్ రెడ్డి పదకొండు రోజుల పాటు జరపనున్నారు. ఈ పెళ్లికి టాలీవుడ్, శాండల్వుడ్, బాలీవుడ్, కోలీవుడ్ నటులు హాజరవుతున్నారని తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా, దేశ విదేశాల నుంచి అతిథులు రానున్నారు.
ఎవరి సంప్రదాయానికి తగినట్లు వారికి వంటలు, ఇంతకు ముందు ఏ ముఖ్యమంత్రి, మంత్రి, పారిశ్రామికవేత్త చేయనంత ఘనంగా పెళ్లి ఏర్పాట్లు చేస్తున్నారు. రూ.550 కోట్లకు పైనే ఖర్చు పెడుతున్నారని తెలుస్తోంది. తన కుమార్తె బ్రహ్మణి వివాహం చరిత్రలో నిలిచిపోయేలా చేయాలని ఆయన సంకల్పించారు. ఇందుకు అనుగుణంగా ఏర్పాట్లు మొదలయ్యాయి.
తన ఆడంబరానికి ఆయన ఆహ్వాన పత్రిక నుంచే శ్రీకారం చుట్టారు. వినూత్నంగా, సృజనాత్మకంగా ఆహ్వాన పత్రికను రూపొందించారు. మొట్టమొదటిసారిగా ఎల్ఈడీ టెక్నాలజీతో వీడియో ఆహ్వాన పత్రికను తయారు చేశారు. ఇన్విటేషన్ కార్డు కూడా ఒక పెద్ద బాక్సులో ఉంటుంది. ఆ బాక్సును తెరిచిన వెంటనే ఆహ్వాన పత్రికలో అమర్చిన బుల్లి తెరపై ఒక వీడియో ప్రారంభమవుతుంది.
తమ కుమార్తె వివాహానికి రావాలంటూ స్వయంగా గాలి జనార్దన్ రెడ్డి, ఆయన భార్య అరుణ, కుమారుడు పాట పాడుతూ ఆహ్వానిస్తారు. 'మాతృదేవోభవ, అతిథి దేవోభవ, ఆచార్య దేవోభవ.. కాయ, వాచ, మనసా ఆహ్వానిస్తున్నాం. బంధువులారా, స్నేహితులారా, ఆత్మీయులారా.. పెళ్లికి వచ్చి మమ్మల్ని దీవించండి' అంటూ ఆ పాట సాగుతుంది. ఇందులోనే వధూవరులను కూడా చూపించారు.
బాక్స్ను తెరిచిన తక్షణం వీడియో దానంతట అదే ప్లే అవుతుంది. బ్రహ్మణి వివాహం హైదరాబాద్కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త విక్రం దేవారెడ్డి కుమారుడు రాజీవ్ రెడ్డితో నవంబరు 16వ తేదీన జరగనుంది. వారి నిశ్చితార్థం గత నెలలో బెంగళూరులోని గాలి నివాసంలో చేశారు. నవంబరు 16వ తేదీ ఉదయం 9 నుంచి 10 గంటల మధ్యలో పెళ్లి ముహూర్తం నిశ్చయించారు. బెంగళూరులోని మెయిన్ ప్యాలెస్ మైదానం ఇందుకు వేదిక కానుంది.