జయరాం హత్య కేసు, శిఖాచౌదరికి క్లీన్చిట్: ఎన్నో ట్విస్ట్లు... పోలీసులేం చెప్పారంటే?
నందిగామ: కోస్టల్ బ్యాంకు డైరెక్టర్ చిగురుపాటి జయరాం హత్య కేసు నిందితులను కృష్ణా జిల్లా నందిగామ పోలీసులు మంగళవారం మీడియా ముందు ప్రవేశపెట్టారు. రాకేష్ రెడ్డితో పాటు మరొకరిని మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ కేసుపై కృష్ణా జిల్లా ఎస్పీ త్రిపాఠి డీఎస్పీ కార్యాలయంలో మీడియాకు వివరాలు తెలిపారు.
జయరాం హత్యలో ట్విస్ట్.. శిఖాకు సంబంధంలేదు!: పోలీస్ అధికారుల సలహా.. ఆ నేతల సాయం కోసమే ఏపీకి?
శిఖాచౌదరిని పరిచయం చేసిందే జయరాం
జయరాం హత్యపై హైవేపై ఉండే పెట్రోలింగ్ వాహనానికి సమాచారం వచ్చిందని ఎస్పీ చెప్పారు. ఈ కేసును తాము సవాల్గా తీసుకొని దర్యాఫ్తు చేశామని చెప్పారు. సెల్ఫోన్ నెంబర్ల ఆధారంగా నిందితులను ట్రేస్ చేసి పట్టుకున్నామని తెలిపారు. నిందితుడు రాకేష్ రెడ్డి హైదరాబాదులో దందాలు చేసేవాడని చెప్పారు. టెక్రాన్ సంస్థ సమస్యలు వచ్చిన సమయంలో జయరాం, రాకేష్ రెడ్డిలకు పరిచయం ఏర్పడిందని చెప్పారు. రాకేష్ రెడ్డికి, జయరాంకే తొలుత పరిచయం ఉందని చెప్పారు. అసలు శిఖా చౌదరిని రాకేష్కు పరిచయం చేసింది జయరామే అన్నారు. తొలుత శిఖా చౌదరి.. రాకేష్ను జయరాంకు పరిచయం చేసినట్లుగా వార్తలు వచ్చాయి.
రూ.80 లక్షలు అడిగాడు, శిఖకు సహకరించాలని రాకేష్కు జయరాం
రాకేష్ రెడ్డి హైదరాబాదులో స్థిరాస్తి వ్యాపారం కూడా చేసేవాడని ఎస్పీ తెలిపారు. జయరాం అమెరికా నుంచి వచ్చిన తర్వాత రూ.80 లక్షలు కావాలని రాకేష్ రెడ్డిని అడిగారని చెప్పారు. జయరాంకు రూ.40 లక్షల చొప్పున రెండుసార్లు ఆ మొత్తాన్ని ఇచ్చాడని చెప్పారు. అలాగే కుత్బుల్లాపూర్లోని తన కంపెనీలో (టెక్రాన్) సమస్యలు వచ్చినప్పుడు, లాకౌట్ సమస్య వచ్చినప్పుడు రాకేష్ రెడ్డికి ఫోన్ చేసి సాయం కోరాడని చెప్పారు. కంపెనీలో సమస్యల పరిష్కారానికి శిఖా చౌదరికి సహకరించాలని రాకేష్ రెడ్డిని జయరాం కోరినట్లు తెలిపారు.
హత్యలో శిఖాచౌదరి పాత్ర లేదు
జయరాం గత నెల (జనవరి) 29వ తేదీన అమెరికా నుంచి వచ్చిన తర్వాత శిఖాచౌదరి ఇంటికి వెళ్లాడని చెప్పారు. డబ్బు కోసం శిఖా చౌదరికి ఫోన్ చేశాడని చెప్పారు. జయరాం హత్య కేసులో శిఖా చౌదరి పాత్ర లేదని ఎస్పీ స్పష్టం చేశారు. తాము శిఖా చౌదరితో కూడా మాట్లాడామని, ఆమెను విచారించి వివరాలు సేకరించామని చెప్పారు. రాకేష్ రెడ్డికి, శిఖా చౌదరికి ఈ మధ్య సంబంధాలు లేవని చెప్పారు. ఈ హత్య కేసులో శిఖా చౌదరి పాత్ర ఉందనేందుకు ఆధారాలు లేవని చెప్పారు.
హత్య చేసి ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం
జయరాంను హత్య చేసి ప్రమాదంలా చిత్రీకరించే ప్రయత్నం చేశారని ఎస్పీ తెలిపారు. జయరాంను కొడితే సోఫా పైనుంచి కిందపడ్డాడని, ఆ తర్వాత చనిపోయాడని చెప్పారు. వాచ్మెన్ సహకారంతో జయరాం కారులో మృతదేహం పెట్టాడని చెప్పారు. జయరాం హత్యకు ఇద్దరు తెలంగాణ పోలీసులు సహకరించినట్లుగా ప్రాథమికంగా గుర్తించినట్లు చెప్పారు. హత్య జరిగిన వెంటనే వారితో మాట్లాడారని చెప్పారు. జయరాం హత్య కేసులో కీలక నిందితుడు రాకేష్ రెడ్డి అన్నారు. ఆర్థిక లావాదేవీలే ఈ హత్యకు కారణమని చెప్పారు. ఈ కేసులో ఇంకా సాక్ష్యాలను సేకరించాల్సి ఉందన్నారు. నిందితులను కస్టడీకి తీసుకొని లోతుగా విచారిస్తామని చెప్పారు. ఈ కేసును హైదరాబాద్కు బదలీ చేసే విషయమై న్యాయ సలహా తీసుకుంటామని ఎస్పీ చెప్పారు. కేసులో ఇంకెవరి ప్రమేయమైనా ఉందా, దర్యాఫ్తు చేస్తున్నామని చెప్పారు.