గుంటూరు చేరిన మాధవి మృతదేహం: బోరుమన్న కుటుంబ సభ్యులు
గుంటూరు: అమెరికాలోని ఫ్లోరిడాలో గల ఓకాలా పట్టణంలో వారం క్రితం రోడ్డు ప్రమాదంలో మరణించిన ఫార్మసిస్టు బాలినేని మాధి చౌదరి మృతదేహం గుంటూరులోని ఆమె అత్తగారింటికి చేరుకుంది. వారం రోజుల క్రితం మాధవి చౌదరి రోడ్డు ప్రమాదంలో మరణించారు.
మృతదేహం వెంట ఆమె భర్త త్రివిక్రమ్ చౌదరి వచ్చారు. గుంటూరు నగరంలోని స్తంబాల దరువులో గల ఇంటికి మృతదేహాన్ని చేర్చారు. మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు బోరున విలపించారు. శుక్రవారం అంత్యక్రియలు జరుగుతాయి. మాధవి చౌదరి మృతదేహాన్ని అమెరికా నుంచి స్వదేశానికి తరలించడంలో తానా సహకరించిదంి.
అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం ఒకాలాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గుంటూరు జిల్లా బాపట్లకు చెందిన బాలినేని మాధవి చౌదరి(39) దుర్మరణం పాలైన విషయం తెలిసిందే. బాపట్ల వివేకానందకాలనీకి చెందిన ఆమె భర్త చేబ్రోలు తివిక్రమ్ చౌదరితో కలిసి ఫ్లోరిడాలో నివసిస్తున్నారు. దంపతులిద్దరూ ఫార్మసిస్టులే. 2004 నుంచి వారు అమెరికాలో నివసిస్తున్నారు.
భారత కాలమానం ప్రకారం బుధవారం రాత్రి 8 గంటల సమయంలో ఒకాలా పట్టణం సమీపంలో రెండు కార్లు ఢీ కొన్న దుర్ఘటనలో మాధవి మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. రోడ్డు ప్రమాదంలో కుమార్తె మృతిచెందిన విషయం తెలిసి బాపట్లలో తల్లిదండ్రులు సీతాదేవి, సాంబశివరావు కన్నీరుమున్నీరయ్యారు. వారి గృహం వద్ద విషాదఛాయలు అలముకున్నాయి.
నిడుబ్రోలుకు చెందిన మాధవి తండ్రి బాలినేని సాంబశివరావు సబ్ రిజిస్ట్రారుగా పని చేసి ఉద్యోగ విరమణ చేశాక బాపట్లలో స్థిరపడ్డారు. బాపట్ల ఫార్మసీ కళాశాలలో బీ ఫార్మసీ చదివిన మాధవి కొంతకాలం ఇదే కళాశాలలో అధ్యాపకురాలిగా పని చేశారు.