కొద్ది గంటల్లో అమెరికా వెళ్లాల్సిన టెక్కీ తల్లితో కలిసి ఆత్మహత్య
ఓ ఎన్నారై టెక్కీ ఆమెరికా బయలుదేరాల్సి ఉన్న సమయంలో తల్లితో కలిసి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ తీవ్ర నిర్ణయం వారెందుకు తీసుకున్నారో తెలియదు.
విశాఖపట్నం: కొద్ది సేపట్లో అమెరికాకు బయలుదేరాల్సిన టెక్కీ తల్లితో కలిసి ఆత్మహత్య చేసుకున్న సంఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. విమానాశ్రయానికి వెళ్లేందుకు ఆటోను తీసుకురావాలని అపార్టుమెంటు వాచ్మన్కు ఆ సాఫ్ట్వేర్ ఇంజనీరు చెప్పాడు కూడా. కానీ, ఇంతలో ఏమైందో తెలియదు గానీ తల్లితో కలిసి ఆత్మహత్య చేసుకున్నాడు.
ఇద్దరూ ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నారు. శుక్రవారం మహా శివరాత్రి పర్వదినం వేళ విశాఖపట్నంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. విశాఖలోని గొల్లలపాలెంలో ఓ అపార్టుమెంటులో కంచుబోయిన భాగ్యలక్ష్మి (65) నివసిస్తోంది. న్యాయవాది అయిన ఆమె భర్త రామారావుతో మనస్పర్థల కారణంగా 20 ఏళ్ల నుంచి విడిగా ఉంటోంది.
1994లో బీజేపీ తరఫున భీమిలి నుంచి రామారావు ఎమ్మెల్యేగా పోటీ చేశారు. వీరికి ఒక కుమారుడు, కూతురు ఉన్నారు. వీరు అమెరికాలో స్థిరపడ్డారు. కుమారుడు ఫణి మహేశ్ (40) సాఫ్ట్వేర్ ఇంజనీర్. అతడి భార్య, ఏడాది కుమారుడు అమెరికాలోనే ఉంటున్నారు.
తల్లిని చూసేందుకు ఫణి వారం క్రితం అమెరికా నుంచి వచ్చాడు. శుక్రవారం తిరిగి బయలుదేరి వెళ్లాల్సి ఉండగా విమానాశ్రయానికి వెళ్లేందుకు ఆటో తీసుకురావాలని అపార్టుమెంట్ వాచమన్కు చెప్పాడు. ఈ లోపలే తల్లీ కొడుకు ఇద్దరూ ఇంటిలోనే కిరోసిన్ పోసుకుని నిప్పు అంటించుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు.
వారి ఫ్లాట్ నుంచి దట్టమైన పొగలు బయటకు రావడం గమనించిన వాచ్మన్ చుట్టుపక్కల వారితో కలిసి అక్కడికి వెళ్లాడు. తలుపులు బద్దలుకొట్టి లోపలికి వెళ్లి వారు మంటల్లో ఉండగా వాటిని ఆర్పేశారు. 108కు ఫోన్ చేశారు. అది వచ్చేసరికి వారు చనిపోయారు.దీంతో భాగ్యలక్ష్మి సోదరుడు కోటేశ్వరరావు రెండో పట్టణ పోలీసులకు ఫిర్యాదుచేశాడు. వారి ఆత్మహత్యకు గల కారణమేమిటో తెలియరాలేదు.
మామూలుగా పట్టణ ప్రాంతాల్లో అంతా గ్యాస్ ఉపయోగిస్తున్నందున కిరోసిన్ దొరకడం కష్టం. కానీ వీరింట్లో ఐదు లీటర్ల కిరోసిన్ టిన్ లభించిందని పోలీసులు తెలిపారు. అంటే ముందుగానే ఆత్మహత్యకు ప్లాన్ చేసుకునే ఉంటారని, అందుకే కిరోసిన తెచ్చుకుని ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.