గోదావరితీరంలో శ్రీకృష్ణ వేషధారణలో ఎన్టీఆర్ విగ్రహం
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహాన్ని గోదావరి నది తీరాన పెట్టబోతున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు మహానాడు వేదికగా చెప్పారు.
ఏపీలో గోదావరి పుష్కరాల పనులు వేగంగా జరుగుతున్నాయి. ఆ అంశం పైన చంద్రబాబు మాట్లాడారు. 268 ఘాట్లలో 248 పుష్కర ఘాట్లను సిద్ధం చేసినట్లు చెప్పారు. వసతుల విషయంలో ఎక్కడా రాజీపడలేని, నాణ్యత లోపాలు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు.
గోదావరి నది ఒడ్డున శ్రీకృష్ణుడి వేషధారణలో ఉన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహాన్ని ప్రతిష్టిస్తామని చెప్పారు. పవిత్ర గోదావరిని సంరక్షించుకోవాల్సిన బాధ్యత అందరి పైన ఉందన్నారు. నదుల అనుసంధానంతో రెండు తెలుగు రాష్ట్రాలకు మేలు జరుగుతుందన్నారు.
ఎన్టీఆర్ ఎన్నో పౌరాణిక చిత్రాల్లో నటించిన విషయం తెలిసిందే. ఆయన నటించిన చిత్రంలోని శ్రీకృష్ణుడి వేషధారణలో ఉన్న విగ్రహాన్ని నదీ తీరాన పెట్టనున్నారు.