ఎన్టీఆర్ నాకు దేవుడు...తల్లిదండ్రుల కంటే ఆయనే గొప్ప:చంద్రబాబు
చంద్రబాబు అసెంబ్లీలో అడుగుపెట్టి 40 ఏళ్లు పూర్తయిన సందర్భంగా గురువారం శాసనసభలో ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు అభినందన తీర్మానాన్ని ప్రవేశ పెట్టారు. ఈ తీర్మానంలో చంద్రబాబులో పాటు రెవిన్యూశాఖ మంత్రి కెఈ కృష్ణమూర్తి, బలరామ్మూర్తి, అశోక్గజపతిరాజు పేర్లు కూడా చేర్చారు. కారణం వారు కూడా శాసన సభ్యులుగా అసెంబ్లీలోకి అడుగుపెట్టి మార్చి 15 తో నలభై ఏళ్లు పూర్తయ్యాయి.
Recommended Video
ఈ సందర్భంగా ఈ సందర్భంగా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు చంద్రబాబు నాయుడుతో తమకున్న అనుబంధాన్ని, అనుభవాలను గుర్తు చేసుకున్నారు. తదనంతరం చంద్రబాబు మాట్లాడుతూ తన రాజకీయ రంగ ప్రవేశం, పొలిటికల్ లైఫ్ లో ఎదుర్కొన్న కష్టాలు, జాతీయ స్థాయిలో రాజకీయంగా వచ్చిన అవకాశాలను గుర్తుచేసుకున్నారు. ప్రజా సేవ చేయడానికి ఇతరులెవరికీ దక్కని అద్భుతమైన అవకాశం తనకు దక్కిందని చంద్రబాబు చెప్పారు. ఎన్టీఆర్ తనకు దేవుడని ఈ సందర్భంగా అన్నారు.
శాసన సభ్యులుగా అసెంబ్లీలోకి అడుగుపెట్టి గురువారం నాటికి 40 ఏళ్లు పూర్తయిన సందర్భంగా శాసనసభలో ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు అభినందన తీర్మానాన్ని ప్రవేశ పెట్టారు. దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబు 40 ఏళ్ల అసెంబ్లీ ప్రస్థానంలో తమకు ఆయనతో ఉన్న అనుబంధం, అనుభవాలు, జ్ఞాపకాలను పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ సందర్భంగా సభికులకు వెల్లడించారు. ఆయన నాయకత్వంలో పని చేయడం తమకు దొరికిన అదృష్టంగా భావిస్తున్నామన్నారు.
అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ...''ఇదో అరుదైన అనుభవం. అరుదైన అనుభూతి. రాజకీయ నాయకుడిగా కాదు....ప్రజా సేవకుడిగా 40 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భాన్ని గుర్తు చేసుకుంటే చాలా సంతృప్తి కలుగుతోంది'' అని అన్నారు. సభ్యులు తమ అనుభవాలు చెబుతుంటే పాత జ్ఞాపకాలన్నీ కళ్లముందు కనిపిస్తున్నా యన్నారు. పార్టీ అధ్యక్షుడిగా, ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నేతగా కుటుంబం కంటే కార్యకర్తలతోనే ఎక్కువగా గడిపానన్నారు. దివంగత ముఖ్యమంత్రి, తన మామ గారైన నందమూరి తారక రామారావును ఉద్దేశించి మాట్లాడుతూ...''ఎన్టీఆర్ నాకు దేవుడు...తల్లిదండ్రుల కంటే ఆయననే గొప్పగా గుర్తుపెట్టుకుంటాను. ఎన్టీఆర్ నుంచి ఎంతో చేర్చుకున్నా...దేనికీ భయపడకుండా ధైర్యంగా ముందడుగు వేసే చొరవ ఆయన నుంచే నేర్చుకున్నా''..అని చెప్పారు.
కుటుంబం గురించి చెబుతూ చంద్రబాబు భావోద్వేగానికి గురయ్యారు...తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో భార్య భవనేశ్వరి సహకారం కూడా మరువలేనిదన్నారు. తన తండ్రి అధికారంలో ఉన్నప్పుడు గానీ, తాను సీఎంగా ఉన్నప్పుడు కానీ ముఖ్యమంత్రి కూతురిగా, భార్యగా ఏనాడూ ఆలోచించలేదన్నారు. ఎప్పుడూ సామాన్య మహిళలు ఆలోచించినట్లుగానే ఆలోచించేదని చెప్పారు. ఇంత ధైర్యంగా పని చేస్తున్నానంటే...తన సతీమణి, కుటుంబ సభ్యులే కారణమన్నారు. వారంలో ఒక రోజు కుటుంబ సభ్యుల కోసం కేటాయించాలని వారు కోరుతున్నారని, అయితే వారి కోరిక తీర్చలేకపోవడం బాధగా ఉందన్నారు.
అయితే వైసిపి నేతలు మాత్రం ఇదంతా ఒక పొలిటికల్ స్టంట్ గా కొట్టిపడేస్తున్నారు. మొన్నే ఎమ్మెల్యేగా గెలిచి 40 ఏళ్లు అయిందంటూ అనుకూల మీడియాలో డబ్బా కొట్టించుకున్నారని...తాజాగా పవన్ కళ్యాణ్ చేసిన విమర్శలతో ఇమేజ్ డ్యామేజ్ కావడంతో అది కవర్ చేసేందుకు...ఇలా వెతికి ఒక కారణం పట్టుకొని చంద్రబాబును పొగుడుతూ ముందే వివిధ రకాలుగా రాసిన స్క్రిప్ట్ లను పంపిణీ చేసి వాటిని చదివించుకుంటూ ఆరోపణల నష్టాన్ని పూడ్చుకునేందుకు విఫలయత్నం చేశారని ఎద్దేవా చేస్తున్నారు.