తాతకు జూనియర్ నివాళి: 'స్వచ్ఛభారత్కు ఎన్టీఆరే స్ఫూర్తి'
హైదరాబాద్: స్వచ్ఛభారత్కు ఎన్టీఆరే స్ఫూర్తి అని ఆయన తనయుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు నందమూరి హరికృష్ణ అన్నారు. ఎన్టీఆర్ 20వ వర్ధంతి సందర్భంగా సోమవారం ఉదయం హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయన నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్ నిరంతరం పేదల అభ్యున్నతికి పాటుపడ్డారని చెప్పారు. గ్రామాలకు రహదారులు, బస్సు సౌకర్యాలు కల్పించిన మహానీయుడు స్వర్గీయ ఎన్టీఆర్ అని కొనియాడారు. అంతేకాదు ప్రస్తుతం దేశంలో అమలవుతున్న స్వచ్ఛభారత్ కార్యక్రమానికి ఎన్టీఆరే స్ఫూర్తి అని అన్నారు.
తెలుగు రాష్ట్రాల్లో నాన్నకు ప్రేమతో రక్తదాన శిబిరాలను విజయవంతం చేయాలని అభిమానులకు ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో లెజండరీ బ్లడ్ డొనేషన్ డ్రైవ్ చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ అభిమానులందరూ బ్లడ్ డొనేషన్ చేయాలని ఆయన చెప్పారు.
టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తన తాత నందమూరి తారకరామావుకు నివాళులర్పించారు. తన తండ్రి, మాజీ ఎంపీ నందమూరి హరికృష్ణతో పాటు కల్యాణ్రామ్, దర్శకుడు వైవీఎస్ చౌదరి తదితరులు ఆయనకు ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించారు.