ఎన్టీఆర్ జయంతి .. నివాళులర్పించిన కుటుంబ సభ్యులు ,టీడీపీ నేతలు .. ఎవరేమన్నారంటే
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, తెలుగుజాతి కీర్తిని నలుదిశలా వ్యాపింపజేసిన మహానటుడు దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ జయంతి వేడుకలను తెలుగు రాష్ట్రాల ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు.ఇక ఈ సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఎన్టీఆర్ కుటుంబ సభ్యులతో పాటు, ఎన్టీఆర్ అభిమానులు, తెలుగుదేశం పార్టీ నేతలు నందమూరి తారక రామారావుకు ఘనంగా నివాళులు అర్పిస్తున్నారు. నేడు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ ను పూలతో అలంకరించారు.
వైసీపీ వైపు తెలుగుదేశం మాజీ ఎమ్మెల్యే: ఇక ఆ జిల్లాలో టీడీపీ గడ్డు పరిస్థితులు.!
రాజకీయాల్లోకి యువతకు ఆహ్వానించిన మొట్టమొదటి వ్యక్తి ఎన్టీఆర్ : బాలకృష్ణ
ఇక నేడు ఎన్టీఆర్ ఘాట్ ను సందర్శించిన హిందూపురం ఎమ్మెల్యే, ఎన్టీఆర్ తనయుడు నందమూరి బాలకృష్ణ తన తండ్రికి నివాళులర్పించారు.ఎన్టీఆర్ పుట్టినరోజు ఒక పండుగ రోజున భావిస్తారని ఆయన అన్నారు.ఆయన అందించిన సంక్షేమ పథకాలు దేశానికి మార్గదర్శకం అయ్యాయని పేర్కొన్నారు. రాజకీయాల్లోకి యువతకు ఆహ్వానించిన మొట్టమొదటి వ్యక్తి ఎన్టీఆర్ అని బాలకృష్ణ గుర్తు చేశారు. తెలుగు వారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన వ్యక్తి ఎన్టీఆర్ అని తెలుగు భాషకు ఘన కీర్తిని ఆయన తీసుకొచ్చారని పేర్కొన్నారు. తెలుగు అనే మూడు అక్షరాలు వింటే తన రక్తం ఉప్పొంగుతుంది అని నందమూరి బాలకృష్ణ పేర్కొన్నారు.నందమూరి బాలకృష్ణ తో పాటు నందమూరి సుహాసిని తదితరులు ఎన్టీఆర్ ఘాట్ ను సందర్శించారు.
ఎన్టీఆర్ కళాసేవను, ప్రజాసేవను స్మరించుకుని స్ఫూర్తిని పొందుదాం : లోకేష్
ఇక ఎన్టీఆర్ జయంతి సందర్భంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ట్విట్టర్ వేదికగా ఎన్టీఆర్ గొప్పతనాన్ని చాటి చెప్పారు. తన జీవితమంతా ఇచ్చిన మాటను అక్షరాలా ఆచరించిన మానవతావాది ఎన్టీఆర్ అని లోకేష్ పేర్కొన్నారు."సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు" అన్న ఎన్టీఆర్ నినాదం పార్టీ కోసం ఆయన అందించిన నినాదం అయినప్పటికీ ఆయన జీవితంలో దానిని అక్షరాల ఆచరించారని ప్రజలకు అవసరమైనప్పుడు తన వంతు సేవను , సహకారాన్ని అందించారని ఆయన ప్రజా బంధువు అని కొనియాడారు. ఇక అంతేకాదు "బడుగులకు రాజకీయ అవకాశాలను పంచిన సమసమాజవాది... పేదలకు మెరుగైన జీవనాన్ని అందించిన సంక్షేమవాది..మహిళలకు సమాన హక్కులను కల్పించిన అభ్యుదయవాది.. నందమూరి తారకరామారావుగారి జయంతి సందర్భంగా ఆ మహానుభావుని కళాసేవను, ప్రజాసేవను స్మరించుకుని స్ఫూర్తిని పొందుదాం'' అని లోకేష్ ట్వీట్లో ఎన్టీఆర్ గొప్పతనాన్ని తెలియజేశారు.
ఎన్టీఆర్ కన్నీరు కారిస్తే, ప్రజలు రక్త కన్నీరు కార్చారు : పురంధరేశ్వరి
ఎన్టీఆర్ కుమార్తె బిజెపి నాయకురాలు పురంధరేశ్వరి ఎన్టీఆర్ ఘాట్ వద్ద తన తండ్రికి నివాళులర్పించి ఎన్టీఆర్ ఆశయాలను సిద్ధాంతాన్ని కొనసాగించడమే నిజమైన నివాళి అని పేర్కొన్నారు. ఎన్టీఆర్ గురించి తాను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదని, ప్రతి తెలుగు వాడి గుండె చప్పుడు ఎన్టీఆర్ అని పేర్కొన్నారు. ఎన్టీఆర్ జీవితం ఒక తెరిచిన పుస్తకం అని, ప్రతి పదం,అక్షరం అందరికీ తెలిసినవేనని ఆమె పేర్కొన్నారు.ఆయన ఒక ప్రభంజనం అని,ఆయన నినదించినప్పుడు ఆంధ్ర రాష్ట్రమే ప్రతిధ్వనించింది అని పురంధరేశ్వరి పేర్కొన్నారు. ఎన్టీఆర్ కన్నీరు కారిస్తే, ప్రజలు రక్త కన్నీరు కార్చారని ఆమె పేర్కొన్నారు. ఆయనకు బిడ్డగా పుట్టడం జన్మ జన్మల సుకృతం అని పురంధరేశ్వరి అన్నారు.
అధ్బుతమైన రాజకీయ నాయకుడు ఎన్టీఆర్ : టీడీపీ నేతలు
ఎన్టీఆర్ జయంతి సందర్భంగా టిడిపి పోలిట్బ్యూరో సభ్యుడు చింతకాయల అయ్యన్నపాత్రుడు ఎన్టీఆర్ ను స్మరించుకున్నారు. తాను రాజకీయాల్లో ఎదిగానంటే అది ఎన్టీఆర్ పెట్టిన భిక్ష అని ఆయన పేర్కొన్నారు. ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీ, ఆ పార్టీ పసుపు జెండా రెపరెపలాడేలా ప్రతి కార్యకర్త కృషి చేయాలని అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు.
ఇక మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సాంప్రదాయ రాజకీయాలకు భిన్నంగా చరిత్ర సృష్టించిన గొప్ప నేత ఎన్టీఆర్ అని కొనియాడారు . ఎన్టీఆర్ అద్భుతమైన లక్షణాలు కలిగిన నాయకుడని, ఆప్యాయత అనురాగాలతో ప్రతీక అని, సంక్షేమ సంస్కరణలకు శ్రీకారం చుట్టిన పేదల పక్షపాతి అని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఎన్టీఆర్ ను కొనియాడారు.
రాష్ట్రవ్యాప్తంగా ఎన్టీఆర్ జయంతి వేడుకలు
ఒక్క ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు ,టిడిపి నేతలు మాత్రమే కాదు రాష్ట్రవ్యాప్తంగా ఎన్టీఆర్ అభిమానులంతా ఎన్టీఆర్ జయంతి వేడుకలు జరుపుకుంటున్నారు. తెలుగు సినీ పరిశ్రమకు ఆయన చేసిన సేవలు, రాజకీయ రంగంలో తెలుగుదేశం పార్టీని స్థాపించి నిరుపమానం అయినటువంటి ఆయన సంస్కరణలను గురించి చర్చించుకుంటున్నారు.