ఎన్టీఆర్ ఫ్యాన్స్పై సీఎం జగన్కు మీరా చోప్రా ఫిర్యాదు.. రియాక్షన్ ఎలా ఉంటుందో..?
సినీ పరిశ్రమలో వ్యక్తి ఆరాధన ఎంతలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చాలావరకు సినీ ప్రపంచం హీరోల చుట్టే అల్లుకుని ఉంటుంది. హీరోల కోసమే కథలు,హీరోల కోసమే భారీ బడ్జెట్లు,హీరోలకే అభిమానులూ... ఇలా ఇండస్ట్రీ అంతా హీరో కేంద్రంగానే తిరుగుతూ ఉంటుంది. ఇదీ చాలాదన్నట్టు ఆ హీరో అభిమానులు,ఈ హీరో అభిమానులు సోషల్ మీడియాలో చేరి రచ్చ రచ్చ చేయడం కామన్. కానీ మా హీరోనే అందరికీ ఫేవరెట్ హీరోగా ఉండాలి.. మా హీరోనే అందరికీ నచ్చాలి అనుకోవడం ఎంతవరకు సమంజసమో ఫ్యాన్స్కే తెలియాలి. నటి మీరా చోప్రాకు ఇలాంటి వివాదమే ఇప్పుడు ఊపిరి సలపనివ్వడం లేదు. తాజాగా ఆమె ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టికి ఈ వివాదాన్ని తీసుకెళ్లారు.
Recommended Video
జగన్కు ఫిర్యాదు చేసిన చోప్రా..
సోషల్ మీడియాలో ఎన్టీఆర్ అభిమానులు తనను ఎంతలా వేధిస్తున్నారో చెబుతూ మీరా చోప్రా సీఎం జగన్ను ట్విట్టర్లో ట్యాగ్ చేశారు. ఆయనతో పాటు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనితను కూడా ట్యాగ్ చేశారు. ఫ్యాన్స్ పేరుతో తనపై అసభ్యకర కామెంట్స్ చేస్తూ ట్విట్టర్లో తనను వేధిస్తున్నారని ఆమె తన ట్వీట్లో పేర్కొన్నారు. గ్యాంగ్ రేప్ చేస్తామని,యాసిడ్ దాడి చేస్తామని బెదిరింపులకు దిగుతున్నారని చెప్పారు. హైదరాబాద్ పోలీసులు ఇప్పటికే వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారని.. దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నానని చెప్పారు.
జగన్ రియాక్షన్ ఎలా ఉండబోతోంది..?
నటి మీరా చోప్రా సీఎం జగన్ దృష్టికి వివాదాన్ని తీసుకెళ్లడంతో ఆయన వైపు నుంచి ఎలాంటి రియాక్షన్ ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది. జగన్ సర్కార్ తీసుకొచ్చిన దిశ చట్టం ప్రకారం సోషల్ మీడియాలో మహిళల అపట్ల అసభ్యకర కామెంట్స్ చేస్తే.. తొలిసారి రెండేళ్లు జైలు శిక్ష,మరోసారి అలాగే చేస్తే నాలుగేళ్ల జైలు శిక్ష తప్పదు. ఏపీలో ఈ చట్టం అమలులోకి వచ్చిన తర్వాత 167కేసుల్లో కేవలం 7రోజుల వ్యవధిలోనే ఛార్జిషీట్లు దాఖలు కాగా, 3నెలల వ్యవధిలో 20 కేసుల్లో దోషులకు శిక్షలు కూడా పడ్డాయి. ఇటీవలే దిశ చట్టంపై సమీక్ష నిర్వహించిన జగన్.. ఈ చట్టాన్ని సక్సెస్ చేయడంలో అధికారుల కృషిని అభినందించారు. వీలైనంత త్వరగా ఈ చట్టానికి రాష్ట్రపతి ఆమోదం లభించేలా, అదేసమయంలో ప్రత్యేక కోర్టులు ఏర్పాటయ్యేలా ప్రయత్నాలు ముమ్మరం చేయాలని ఆయన ఆదేశించారు. దిశ చట్టం అమలుపై ఇంతలా ఫోకస్ చేసిన జగన్.. తాజాగా మీరా చోప్రా చేసిన ఫిర్యాదుపై ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.
అసలేంటీ వివాదం..
తెలుగులో బంగారం, వాన, మారో,గ్రీకువీరుడు తదితర చిత్రాల్లో నటించిన మీరా చోప్రా ఇటీవల సోషల్ మీడియాలో చిట్ చాట్ చేసింది. ఈ సందర్భంగా తెలుగులో మీ అభిమాన హీరో ఎవరని ఓ నెటిజన్ ఆమెను ప్రశ్నించగా.. మహేష్ బాబు అని బదులిచ్చింది. మరో నెటిజన్ ఎన్టీఆర్ గురించి అడగ్గా.. తాను ఎన్టీఆర్ ఫ్యాన్ని కాదని ఆయన కంటే మహేష్ బాబు అంటేనే ఎక్కువ ఇష్టపడుతానని చెప్పింది. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆగ్రహంతో ఊగిపోయారు. సోషల్ మీడియాలో మీరా చోప్రాను ట్యాగ్ చేసి బండ బూతులు తిడుతున్నారు. అంతేకాదు,నీ తల్లిదండ్రులు కరోనాతో చస్తారని శాపనార్థాలు పెడుతున్నారు. ఇప్పటికే ఈ వివాదంపై చోప్రా జాతీయ మహిళా కమిషన్కు కూడా ఫిర్యాదు చేసింది. తాజాగా సీఎం జగన్కు ఆమె ఫిర్యాదు చేయడంతో వివాదం ఏ మలుపు తిరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది.