'అందుకే ఎన్టీఆర్ జిల్లా పేరు తెరపైకి': అల్లుడు చేయలేని పని.. లక్ష్మీపార్వతి ఆనందం
నిమ్మకూరు: కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడతానని వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రకటనపై తెలుగుదేశం పార్టీ నేతలు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. పేరు పెట్టాలనే ఆలోచన మంచిదేనని ఒకరు అంటే, అది తాము కూడా చేయాలనుకున్నామని మరొకరు, ఎన్టీఆర్ పేరు పెట్టేందుకు ఆయనెవరని మరొకరు అంటున్నారు.
'జగన్ పులివెందుల నుంచి పోటీ చేయరు, వైసీపీలో గుసగుస! వారం నుంచి కనిపించని విజయసాయి'
కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టాలనే జగన్ ఆలోచన మంచిదేనని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. అయితే తమ తిరుపతి సభను పక్క దారి పట్టించేందుకే జగన్ ఈ ప్రకటన చేశారని వ్యాఖ్యానించారు. అసలు జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టాలనే ప్రతిపాదన ప్రభుత్వం వద్ద ఉందని చెప్పారు.
ఎన్టీఆర్ పేరు ఎత్తే అర్హత లేదు
వైయస్ జగన్మోహన్ రెడ్డివి అన్నీ పిల్లచేష్టలు అని కళా వెంకట్రావు అన్నారు. అసలు ఎన్టీఆర్ పేరు ఎత్తే అర్హత జగన్కు లేదన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి కొడుకు అయిన జగన్ కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడతానని చెప్పడం ఏమిటని ప్రశ్నించారు. ప్రత్యేక హోదాపై మోడీ చేసిన మోసాన్ని తాము ఎండగడతామన్నారు.
అందుకే ఎన్టీఆర్ పేరు తెరపైకి
తిరుపతి సభ నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోందని కళా వెంకట్రావు అన్నారు. అందుకే ఎన్టీఆర్కు జిల్లా పేరు అంటూ తెరపైకి తెచ్చారని వ్యాఖ్యానించారు. తమ ధర్మ పోరాట సభ నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడతామని జగన్ ప్రకటించారని అచ్చెన్నాయుడు అన్నారు.
ఎన్టీఆర్ను ఒక్క జిల్లాకే పరిమితం చేయడం ఏమిటి?
జగన్కు స్వర్గీయ నందమూరి తారక రామారావుపై అంత ప్రేమే ఉంటే అసెంబ్లీలో ఎందుకు ప్రస్తావించలేదని మంత్రి నక్కా ఆనందబాబు ప్రశ్నించారు. ఎన్టీఆర్ను ఒక్క కృష్ణా జిల్లాకే పరిమితం చేయడం ఏమిటని ప్రశ్నించారు. కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టడానికి జగన్ ఎవరని బుద్ధా వెంకన్న ప్రశ్నించారు. తమ పోరాటాన్ని పక్కదారి పట్టించేందుకే ఈ ప్రకటన అన్నారు. జగన్ రాష్ట్ర ఖజానా దోచుకున్న వ్యక్తి అని, ఆయనతో బీజేపీ రాజకీయం నడుపుతోందన్నారు.
లక్ష్మీపార్వతి పట్టలేని సంతోషం
జగన్ ప్రకటనపై వైసీపీ నేత లక్ష్మీపార్వతి స్పందించారు. ఆయన ప్రకటనను స్వాగతించారు. తన అల్లుడు చంద్రబాబు, కొడుకు బాలకృష్ణలు చేయలేని పనిని జగన్ చేస్తానని చెప్పడం తనకు పట్టలేని సంతోషంగా ఉందని ఉబ్బితబ్బిబ్బయ్యారు. హోదాపై జగన్ అలుపెరగని పోరాటం చేస్తుంటే టీడీపీ నేతలు చిత్తశుద్ధి లేని డ్రామాలు ఆడుతున్నారన్నారు.