ఎన్టీఆర్ ఆశయాలను కొనసాగిస్తున్న జగన్,కేసీఆర్ లకే ఆయన ఆశీస్సులు : లక్ష్మీ పార్వతి
నేడు టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు, మహానటుడు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు,తెలుగుదేశం పార్టీ నేతలు,ఆయన అభిమానులు నివాళులర్పిస్తున్నారు.ఇక నేడు ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఎన్టీఆర్ కు నివాళులు అర్పించిన లక్ష్మీపార్వతి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైసిపి నేత, తెలుగు అకాడమీ చైర్మన్ లక్ష్మీపార్వతి ఎన్టీఆర్ ఆశయాలను కొనసాగించిన వారికే ఎన్టీఆర్ ఆశీస్సులు ఉంటాయని పేర్కొన్నారు.
చంద్రబాబు రాజకీయానికి రంగనాయకమ్మ, డాక్టర్ సుధాకర్ బలయ్యారన్న లక్ష్మీ పార్వతి
తెలుగు రాష్ట్రాలకు అదృష్టం కొద్దీ దొరికిన మంచి ముఖ్యమంత్రులని కితాబు
ఆంధ్ర ప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి, తెలంగాణ సీఎం కెసిఆర్ లు ఎన్టీఆర్ ఆశయాలను కొనసాగిస్తున్నారని, ఆయన ఆశీస్సులు వారికి తప్పకుండా ఉంటాయని లక్ష్మీపార్వతి పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి, కెసిఆర్ కు దివంగత నటుడు, ఆంధ్రుల ఆరాధ్యుడు అయిన ఎన్టీఆర్ ఆశీస్సులు ఉంటాయని చెప్పిన ఆమె ఇవాళ ఎన్టీఆర్ జయంతి కావడంతో హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్లో నివాళులు అర్పించారు. తెలుగు రాష్ట్రాలకు అదృష్టం కొద్దీ మంచి ముఖ్యమంత్రులు దొరికారని, ఇక వీరి పాలనలో రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉంటారని ఆమె పేర్కొన్నారు.
ఎన్టీఆర్, వైయస్ రాజశేఖర్ రెడ్డి ఆశయాలను కొనసాగిస్తున్న వైయస్ జగన్
ప్రస్తుతం ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి అటు ఎన్టీఆర్ ఆశయాలను, ఇటు వైయస్ రాజశేఖర్ రెడ్డి ఆశయాలను కొనసాగిస్తున్నారని లక్ష్మీపార్వతి కితాబిచ్చారు. తెలుగు వారి కష్టాలను తీర్చడానికి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అహర్నిశలు కృషి చేస్తున్నారని లక్ష్మీ పార్వతి చెప్పుకొచ్చారు.అంతేకాదు తెలంగాణ ప్రజలను సీఎం కేసీఆర్ గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్నారని, ఏపీ ప్రజల కోసం వైయస్ జగన్మోహన్ రెడ్డి విశ్రాంతి లేకుండా కష్టపడుతున్నారని లక్ష్మీపార్వతి కితాబిచ్చారు.
Recommended Video
ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పిస్తున్న ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు
ఇక నేడు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా కుటుంబ సభ్యులు ఎన్టీఆర్ ఘాట్ ను సందర్శించి నివాళులర్పించారు. టిడిపి నేత, హిందూపురం ఎమ్మెల్యే, ఎన్టీఆర్ తనయుడు, నటుడు నందమూరి బాలకృష్ణ తన తండ్రికి నివాళులర్పించి తెలుగు వారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే మహనీయమైన వ్యక్తి ఎన్టీఆర్ అని కొనియాడారు. ఆయన అందించిన సంక్షేమ పథకాలే దేశానికి ఆదర్శంగా నిలిచాయని పేర్కొన్నారు. ఇక నందమూరి బాలకృష్ణ తో పాటు నందమూరి సుహాసిని కూడా ఎన్టీఆర్ ఘాట్ ను సందర్శించి నివాళులర్పించారు.