వివాదానికి తెర!: ఎన్టీఆర్ విగ్రహాన్ని కూడా తొలగించారు
అమరావతి: కృష్ణా పుష్కరాలను పురస్కరించుకుని రహదారులపై ఉన్న పలు విగ్రహాలను ఇప్పటికే ప్రభుత్వం తొలగించిన విషయం తెలిసిందే. అయితే, ఈ క్రమంలో అధికార తెలుగుదేశం పార్టీ నాయకులు ఎటువంటి అనుమతులు లేకుండా స్థానిక మ్యూజియం సెంటర్లో దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు వివాదాస్పదంగా మారింది.'ఏంటిది?:
వైయస్సార్ విగ్రహం తొలగించి.. ఎన్టీఆర్ విగ్రహమా?'
ఈ నేపథ్యంలో ఎట్టకేలకు జిల్లా అధికార యంత్రాంగం సూచన మేరకు బుధవారం రాత్రి పొద్దుపోయాక రాత్రికి రాత్రే ఎన్టీఆర్ విగ్రహాన్ని తొలగించారు. రాష్ట్రంలో ఎటువంటి విగ్రహాల అనుమతికి అవకాశం లేకపోయినా అధికార దర్పంతో కొందరు నాయకులు స్థానిక నాయకుల అండదండలతో ఎన్టిఆర్ విగ్రహాన్ని ఏర్పాటుచేశారని ప్రతిపక్ష నేతలు ఆరోపించారు.
అంతేగాక, ఈ విగ్రహం ఏర్పాటుపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరసన ప్రదర్శన నిర్వహించి స్థానిక పోలీసుస్టేషన్లో ఫిర్యాదు కూడా చేశారు.
ఈ విగ్రహం ఏర్పాటు కాస్త చినికి చినికి గాలివానలామారి టిడిపి కమాండ్ దృష్టికెళ్లడం, మెయిన్రోడ్డులో ఆర్అండ్బి, రెవెన్యూ అధికారుల అనుమతి లేకుండా ఏర్పాటు చేయడం వల్ల విగ్రహాన్ని తొలగించివేశారు. ఎట్టకేలకు ఎన్టిఆర్ విగ్రహం తొలగించడంతో కృష్ణా పుష్కరాల సందర్భంగా వివాదం ఏర్పడుతుందేమోనన్న సమస్య సానుకూలంగా పరిష్కారమైంది.