గోదావరి తీరంపై ఎన్టీఆర్ విగ్రహానికి వ్యతిరేకత
రాజమండ్రి: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, ప్రముఖ సినీ నటుడు ఎన్టీ రామారావు విగ్రహ ప్రతిష్టాపనకు రాజమండ్రి స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. పుష్కరాల సందర్భంగా గోదావరి తీరంపై ఎన్టీ రామారావు విగ్రహాన్ని ప్రతిష్టించడానికి తెలుగుదేశం ప్రభుత్వం పూనుకుంది. అయితే, అందుకు స్థానికులు అభ్యంతరం చెబుతున్నారు.
స్థానిక వైతాళికుల విగ్రహాలు మాత్రమే ఉండాలని స్థానికులు పట్టుబడుతున్నారు. ఈ ప్రాంతంతో సంబంధం లేని విగ్రహాల ప్రతిష్టాపనను తాము అంగీకరించబోమని అంటున్నారు. స్థానిక మహానుభావుల విగ్రహాల ప్రతిష్టాపనకు మాత్రమే అంగీకరిస్తామని చెబుతున్నారు.
వేంగి చాళుక్య రాజు రాజరాజనరేంద్రుడి విగ్రహాన్ని ప్రతిష్టించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అలాగే, సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం పంతులు, ఆదికవి నన్నయ్య, గోదావరి దేవత, శివుడు వంటి విగ్రహాలను మాత్రమే నెలకొల్పాలని డిమాండ్ చేస్తున్నారు.
ఎన్టీ రామారావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారే అయినప్పటికీ రాజమండ్రి వాస్తవ్యులు కారు. ఆయన కృష్ణా జిల్లా నిమ్మకూరుకు చెందినవారు. దాంతో రాజమండ్రి వద్ద గోదావరి తీరంపై ఎన్టీ రామావు విగ్రహాన్ని ప్రతిష్టంచే ఆలోచనను స్థానికులు వ్యతిరేకిస్తున్నారు.