’ఏంటిది?: వైయస్సార్ విగ్రహం తొలగించి.. ఎన్టీఆర్ విగ్రహమా?’
అమరావతి: కృష్ణా పుష్కరాలను పురస్కరించుకుని రోడ్డు వెడల్పులో భాగంగా రహదారులపై ఉన్న విగ్రహాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తొలగిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే విజయవాడ కూడళ్లలోని దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహంతోపాటు పలు విగ్రహాలను తొలగించింది.
ఈ క్రమంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. ఏపీకి ముఖ్యమంత్రిగా సేవలందించిన వైయస్సార్ విగ్రహానికి తొలగించడం సరికాదని పేర్కొంది. అంతేగాక, విగ్రహాన్ని అక్కడే మళ్లీ ప్రతిష్టించాలని డిమాండ్ చేస్తూ ఆందోళనలు కూడా చేసింది.
ఈ నేపథ్యంలో రాజధాని అమరావతి-విజయవాడ రహదారిపై పాత అమరావతిలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ సీఎం దివంగత ఎన్టీఆర్ విగ్రహాన్ని కొత్తగా ఏర్పాటు చేయడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది.
కాగా, ఎలాంటి అనుమతులు తీసుకోకుండా ఈ విగ్రహాన్ని పెట్టడంపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ఆ విగ్రహాన్ని అక్కడ్నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.
వైయస్సార్ కాంగ్రెస్ అదే రహదారిపై ఉన్న మహాత్మాగాంధీ, పొట్టి శ్రీరాములు విగ్రహాలను రోడ్డు వెడల్పులో భాగంగా తొలగించారని, ఇప్పుడు కొత్తగా నిర్మించిన రోడ్డును తవ్వేసి ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఎస్కె హష్మీ, ఎం. లక్ష్మణ్, సాంబశివరావులు ఆరోపించారు.
అది కూడా రోడ్డు మధ్యలోనే విగ్రహాన్ని ఏర్పాటు చేశారని మండిపడ్డారు. ఈ రహదారి ప్రముఖ దేవాలయం అమరేశ్వరానికి వెళ్లే ప్రధాన మార్గమని చెప్పారు. అక్కడ 125ఫీట్ల ధ్యాన బుద్ధ విగ్రహం, కాలచక్ర మ్యూజియం, మరో ఐదు ఆలయాల కాంప్లెక్సులు ఉన్నాయని చెప్పారు. అంతేగాక, కృష్ణా పుష్కరాల కోసం వెళ్లే భక్తులు ఈ మార్గం ద్వారానే నది స్నానపు ఘట్టాలకు చేరుకుంటారని తెలిపారు.
ప్రస్తుతం ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహం వల్ల పుష్కరాల కోసం వచ్చే భక్తజనం ట్రాఫిక్ ఇక్కట్లు ఎదుర్కొంటారని వారన్నారు. తెలుగుదేశం నేతలు వారి ప్రాబల్యాన్ని చాటుకోవడానికే ఈ రకంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. పుష్కరాల కోసం ఆలయాలు, మసీదులు, చర్చీలు కూల్చేసిన తెలుగుదేశం సర్కారు.. ఈ రకంగా వ్యవహరించడం దారుణమన్నారు.
రోడ్డును తవ్వి ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ప్రభుత్వం ఎలా అనుమతిస్తుందని వారు ప్రశ్నించారు. ప్రయాణికులకు ఇబ్బంది కలిగించేలా ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటు చేయడంపై అమరావతి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.