నమ్మించి మోసం చేసిన లాయర్: బెజవాడలో నర్సు అనుమానాస్పద మృతి
విజయవాడ: నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో పనిచేస్తున్న నర్సు అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. నర్సు మృతికి కారణమైన వ్యక్తిని అరెస్ట్ చేయలాంటూ ప్రజా సంఘాలు, మహిళలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టడంతో ఉద్రికత్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. చివరకు పోలీసులు రంగంలోకి దిగి మహళలను సముదాయించడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.
వివరాల్లోకి వెళితే... అరుణ కుమారి అనే నర్సు నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తోంది. లాయర్గా పనిచేస్తున్న మల్లిఖార్జున శర్మ అనే వ్యక్తి తల్లికి ఆరోగ్య పరిస్థతి బాగుండక పోవడంతో ప్రతి రోజూ అదే ఆసుపత్రికి తీసుకెళ్లేవాడు. ఈ క్రమంలో నర్సు అరుణ కుమారితో లాయర్ మల్లిఖార్జునకు పరిచయం ఏర్పడింది.
ప్రతి రోజూ ఇంటికి వచ్చి తన తల్లికి డ్రస్సింగ్ చేయాలని అరుణ కుమారిని కోరడంతో అందుకు ఆమె కాదనలేకపోయింది. ఇలా ప్రతి రోజూ లాయర్ ఇంటికి వెళ్లి ఆమెకు డ్రస్సింగ్ చేస్తున్న క్రమంలో ఆమె మంగళవారం మధ్యాహ్నా సమయంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది.
ఈ విషయాన్ని ఎవరికీ చెప్పకుండా నర్సు మృతి దేహాన్ని అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించి, ఆ తర్వాత తల్లిదండ్రులకు సమాచారం అందించాడు. దీంతో సమాచారం అందుకున్న నర్సు బంధువులు ఆమె మృతదేహాంతో లాయర్ ఇంటి ముందు నడిరోడ్డుపై బుధవారం ఆందోళనకు దిగారు.
ఉద్యోగం పేరిట ఆమె వద్ద నుంచి నలభై వేలు తీసుకుని ఆమెను దారుణంగా మోసం చేశాడని బంధువులు ఆరోపిస్తున్నారు. మోసగాడైన లాయర్ను వెంటనే అరెస్ట్ చేయాలని కోరుతూ స్థానిక ప్రజా సంఘాలతో పాటు మహిళలు పెద్ద ఎత్తున నడిరోడ్డుపై బైఠాయించి ఆందోళన నిర్వహించారు.
దీంతో సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి ఆందోళన నిర్వహిస్తున్న మహిళలతో సంప్రదింపులు జరిపి, ఈ సంఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న లాయర్ మల్లిఖార్జునను అరెస్ట్ చేస్తామని హామి ఇవ్వడంతో ఆందోళనను విరమించారు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నామని దర్యాప్తు ప్రారభిస్తామని పోలీసులు చెప్పారు.