క్లాస్ రూమ్ లోనే కుప్పకూలిన భవ్య: కేకలు పెట్టిన విద్యార్థులు.. చివరికి విషాదమే మిగిలింది..
పరీక్ష రాస్తున్న క్రమంలోనే భవ్యకు ఫిట్స్ వచ్చాయి. నోటిలో నుంచి నురగలు కక్కడంతో తోటి విద్యార్థులు భయంతో కేకలు వేశారు.
అనంతపురం: బాగా చదువుకోవాలన్న ఆమె తాపత్రయం డెంగీ జ్వరాన్ని కూడా లెక్కచేయలేదు. తీవ్ర జ్వరంతో బాధపడుతూనే పరీక్ష రాసేందుకు హాజరైంది. కానీ అప్పటికే జ్వరం తీవ్రం అవడం.. ఫిట్స్ కూడా రావడంతో ఆ విద్యార్థి పరీక్ష హాల్లోనే కుప్పకూలిపోయింది. చికిత్స పొందుతూ ఓ ప్రైవేటు ఆసుపత్రిలో మృతి చెందింది.
జ్వరంతోనే పరీక్షకు
మడకశిరలోని అమరాపురం మండలం రంగాపురం గ్రామానికి చెందిన కేఎన్ లక్ష్మణమూర్తి-శాంతమ్మల కూతురు ఎం.భవ్య (21) నగరంలోని ఆదర్శ నర్సింగ్ కళాశాలలో మూడో సంవత్సరం చదువుతోంది. కొంతకాలంగా జ్వరంతో బాధపడుతున్న ఆమె శుక్రవారం ఓబీజీ పరీక్ష రాసేందుకు వైద్య కళాశాలకు వచ్చింది.
పరీక్ష హాల్లోనే ఫిట్స్
పరీక్ష రాస్తున్న క్రమంలోనే భవ్యకు ఫిట్స్ వచ్చాయి. నోటిలో నుంచి నురగలు కక్కడంతో తోటి విద్యార్థులు భయంతో కేకలు వేశారు. దీంతో వెంటనే సమీపంలోని సర్వజనాసుపత్రికి తరలించారు. రక్త పరీక్షలు చేసిన అక్కడి వైద్యులు.. ప్లేట్ లెట్స్ చాలా తక్కువగా ఉన్నట్టు నిర్దారించారు.
చికిత్స పొందుతూ మృతి
ప్లేట్ లెట్స్ తక్కువగా ఉండటం.. సెలైన్ పెట్టిన వద్ద రక్తం రావడంతో వెంటిలేటర్ ద్వారా కృత్రిమ శ్వాస అందించే ప్రయత్నం చేశారు. అప్పటికే భవ్య ఆరోగ్య పరిస్థితి మరింత విషమించింది. దీంతో మధ్యాహ్నాం 3గం. సమయంలో ఆమె ఆసుపత్రిలోనే మృతి చెందింది.
విలపించిన విద్యార్థులు
భవ్య మృతితో ఆమె తోటి విద్యార్థులు కన్నీరుమున్నీరుగా విలపించారు. విషయాన్ని ఆమె తల్లిదండ్రులకు చేరవేయడంతో.. ఆమె పెద్దనాన్న నాగరాజు అనంతపురం వచ్చి మృతదేహాన్ని తీసుకెళ్లారు. తలలో రక్తం గడ్డకట్టడం, ప్లేట్ లెట్స్ తక్కువగా ఉండటంతోనే ఆమె మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. వారం రోజులుగా భవ్య జ్వరంతో బాధపడుతున్నట్టు చెప్పారు.