నూజివీడు ట్రిపుల్ ఐటీ సంచలనం: 15మంది విద్యార్థులపై వేటు, 54మందిపై చర్యలు
నూజివీడు ట్రిపుల్ ఐటీ సంచలన నిర్ణయం తీసుకుంది. గత వారం రోజులుగా తీవ్ర కలకలం రేపిన ర్యాగింగ్ వ్యవహారంపై ఐటీ యాజమాన్యం కఠిన చర్యలు తీసుకుంది.
కృష్ణా: నూజివీడు ట్రిపుల్ ఐటీ సంచలన నిర్ణయం తీసుకుంది. గత వారం రోజులుగా తీవ్ర కలకలం రేపిన ర్యాగింగ్ వ్యవహారంపై ఐటీ యాజమాన్యం కఠిన చర్యలు తీసుకుంది. 15మంది విద్యార్థులపై ఏడాదిపాటు సస్పెన్షన్ విధించడంతోపాటు మరో 24మందిని క్యాంపస్ నుంచి పంపించారు.
వివరాల్లోకి వెళితే.. నూజివీడు ట్రిపుల్ ఐటీలో విద్యార్థుల మధ్య చోటు చేసుకున్న ఘర్షణలు కొట్లాటకు దారి తీశాయి. జూనియర్ విద్యార్థులు తమపై బోధనా సిబ్బందికి ఫిర్యాదు చేస్తున్నారంటూ కొందరు సీనియర్ విద్యార్థులు ఆగస్టు 29 ఆర్ధరాత్రి వారిని ఓ గదిలో నిర్భంధించి కొట్టారు.
ఈ ఘటనలో 12 మంది గాయపడ్డారు. దీంతో ఈ ఘటనపై ఓ కమిటీని నియమించారు. కమిటీ సిఫార్సుల మేరకు ఆరుగురు విద్యార్థుల మీద ఏడాది పాటు సస్పెన్షన్తో పాటు వారిని సంవత్సరాంత పరీక్షలకు అనుమతి ఇవ్వకుండా యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేసింది.
మరో తొమ్మిది మందిని ఏడాది పాటు సస్సెండ్ చేస్తూ పరీక్షలు రాసేందుకు మాత్రం అనుమతి ఇచ్చింది. 13 మందిని నవంబరు వరకు సస్పెండ్ చేశారు. 24 మందిని కేంపస్ నుంచి పంపించారు. మొత్తం 54 మంది విద్యార్థులపై క్రమశిక్షణా చర్యలు చేపట్టినట్లు కళాశాల సంచాలకుడు ఆచార్య వి వెంకటదాసు తెలిపారు.
కాగా, కళాశాల యాజమాన్యం చర్యల పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. చదువుకునేందుకు వచ్చిన విద్యార్థులు రౌడీయిజం, గుండాయిజం చేయడం సరికాదని వారు అభిప్రాయపడ్డారు.