కేసు తప్పించాలంటే నాతో గడపాల్సిందే: వివాహితపై ఎస్ఐ లైంగిక వేధింపులు
కృష్ణా జిల్లాలో మరో ఎస్ఐ భాగోతం వెలుగు చూసింది. ఓ వివాహితపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న ఎస్ఐపై బాధితురాలు జిల్లా ఎస్పికి ఫిర్యాదు చేసింది.
విజయవాడ: కృష్ణా జిల్లాలో మరో ఎస్ఐ భాగోతం వెలుగు చూసింది. ఓ వివాహితపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న ఎస్ఐపై బాధితురాలు జిల్లా ఎస్పికి ఫిర్యాదు చేసింది. భాదితురాలి ఫిర్యాదు మేరకు ఎస్ఐ వెంకట్కుమార్పై పోలీసు శాఖ క్రమశిక్షణ చర్యలు తీసుకొందని సమాచారం.
కృష్ణా జిల్లా నూజివీడు ఎస్సై వెంకట్ కుమార్ వేధింపులు భరించలేకపోతున్నానని ఒక మహిళ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. ప్రభుత్వోద్యోగి భార్య అయిన బాధిత మహిళ ఒక ప్రైవేటు స్కూల్ లో టీచర్ గా పని చేస్తోంది.భర్త కేసు విషయంలో నూజివీడు పోలీస్ స్టేషన్ కు వెళ్లింది. ఆ సమయంలో ఎస్సై వెంకట్ కుమార్ బాధితురాలిని చూశాడు. అప్పటి నుంచి తనపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని బాధితురాలు ఆరోపిస్తోంది.
తనతో గడిపితే ఆమె భర్తను కేసు నుంచి తప్పిస్తానని ఎస్సై వెంకట్ కుమార్ బంపర్ ఆఫర్ ఇచ్చాడు. తాను అలాంటి వ్యక్తిని కాదని, తనను వేధించవద్దని ఆమె ఎంత వేడుకున్నా ఎస్సై మాత్రం వినడం లేదు. కేసు నుంచి తప్పించాలంటే లాడ్జీకి రావాల్సిందేనని, తనతో గడపాల్సిందేనని స్పష్టం చేశాడు.
దీంతో అతని ఫోన్ వేధింపులను రికార్డు చేసిన బాధితురాలు, ఆ రికార్డులను జిల్లా పోలీసు ఉన్నతాధికారులకు వినిపించింది. అతని వేధింపులు భరించలేకపోతున్నానని భాదితురాలు ఆవేదన వ్యక్తం చేస్తోంది.
తనకు చావే శరణ్యమని చెబుతోంది భాదితురాలు. దీంతో ఈ వ్యవహారంపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అతనిపై క్రమశిక్షణాచర్యలు తీసుకోనున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు ఎస్ఐ వెంకటకుమార్ను సెలవుపై వెళ్ళాలని పోలీసు ఉన్నతాధికారులు ఆదేశించారని సమాచారం.