హిట్లర్లా, ఓవైసీ బ్రదర్స్ ఆడించినట్లు: కేసీఆర్పై బీజేపీ
హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణనంతా తన సామ్రాజ్యంగా భావించి, ఆయన, ఆయన కుటుంబం చెప్పినట్లే సాగాలంటూ నియంత హిట్లర్ను మరిపిస్తున్నారని, తుగ్లక్ను మురిపిస్తున్నారని బీజేపీఎల్పీ ఉప నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ సోమవారం ధ్వజమెత్తారు. పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
రాష్ట్ర విభజన అనంతరం కేసీఆర్ మాట్లాడుతూ.. బిల్లులోని ప్రతి అంశం తనకు తెలుసు అని, అన్ని విషయాలను తనకు చెప్పాకే బిల్లును ప్రవేశపెట్టారంటూ అన్నారని గుర్తు చేశారు. అలాంటప్పుడు గవర్నర్కు శాంతి భద్రతల అధికారాలను అప్పగిస్తే ఇప్పుడెందుకు అభ్యంతరం చెబుతున్నారన్నారు. ఆ రోజు ఒక మాట చెప్పి, ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీని ఫాసిస్టు అంటున్నారన్నారు.
మోడీకి కేసీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. గవర్నర్కు అధికారాలు ఇస్తే... జంట నగరాల్లో తమ పెత్తనం పోతుందేమోనన్న భయంతో మజ్లిస్ నేతలు, ఒవైసీ బ్రదర్స్ చెప్పినట్లు కేసీఆర్ ఆడుతున్నారన్నారు. ఇది వరకు అసదుద్దీన్ ఒవైసీ చెబితేనే ప్రభుత్వ లోగోలో చార్మినార్ను ముద్రించారన్నారు.
గవర్నర్కు అధికారాలపై బీజేపీ వైఖరి ఏమిటని ప్రశ్నించగా.. యూనివర్సిటీలకు గవర్నరే చాన్స్లర్గా ఉంటారని, కానీ మంత్రి మండలి సూచనల మేరకే యూనివర్సిటీల్లో నియామకాలు జరుగుతాయన్నారు. గవర్నర్కు అధికారాల అంశంపై అనవసరంగా వ్యతిరేక ప్రచారం చేస్తున్నారని, ఇదంతా చట్టంలో ఉన్న అంశమేనన్నారు. ఈ నెల 19న నిర్వహించేసకల జన సర్వేతో ప్రజలకు తీవ్ర నష్టమని, రేషన్ కార్డులు, పింఛన్లు, ఇళ్లు, ఇతర సంక్షేమ పథకాల్లో కోత పడుతుందన్నారు.
ఎంసెట్ కౌన్సెలింగ్ పైన కిషన్ రెడ్డి
సుప్రీం కోర్టు తీర్పు మేరకు ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు అనవసర భేషజాలకు పోకుండా ఇకనైనా ఎంసెట్ అడ్మిషన్ల ప్రక్రియను పూర్తి చేయాలని బీజేపీ తెలంగాణ అధ్యక్షులు కిషన్ రెడ్డి హితవు పలికారు. విభజన చట్టంలోని అంశాలకు లోబడి ప్రక్రియను పూర్తి చేయాలంటూ కోర్టు ఇచ్చిన తీర్పును తమ పార్టీ స్వాగతిస్తుందని తెలిపారు. ఆయా అంశాలపై విభజన సందర్భంలో స్పందించకుండా ఇప్పుడు రాజకీయం చేయడం తగదన్నారు. ఈ పర్యాయం అడ్మిషన్లను పూర్తి చేసి, వచ్చే విద్యా సంవత్సరం నాటికి ఇరు రాష్ట్రాల మధ్య వివాదాస్పదంగా మారిన అంశాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలన్నారు.
గవర్నర్ అధికారాలపై దత్తాత్రేయ
గవర్నరు అధికారాలపై హోంమంత్రి రాజ్నాథ్ సింగ్తో చర్చించానని బీజేపీ ఎంపీ బండారు దత్తాత్రేయ అన్నారు. గవర్నరు పాలనను బలవంతంగా రుద్దుతున్నారనే భావన తెలంగాణ ప్రజల్లో ఉందన్నారు. తెలంగాణ ప్రజల అనుమానాలను నివృత్తి చేయాలని రాజ్నాథ్ సింగ్ను కోరానన్నారు. పార్లమెంటు సమావేశాల తర్వాత చర్చిస్తానని రాజ్ నాథ్ చెప్పారన్నారు.