కేసీఆర్కు కూల్చివేత షాక్:కవితపై బాంబుపేల్చిన బీజేపీ!
హైదరాబాద్: అయ్యప్ప సొసైటీ భూములకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర సమితి నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత పైన భారతీయ జనతా పార్టీ శాసన సభా పక్ష ఉప నేత ఎన్వీవీఎస్ ప్రభాకర్ బుధవారం బాంబు పేల్చారు! ఆయన బీజేపీ కార్యాలయంలో నెల రోజుల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన పైన మండిపడ్డారు. ఈ సమయంలో ఆయన అయ్యప్ప సొసైటీ భూముల పైన స్పందించారు.
అయ్యప్ప సొసైటీ భూములకు సంబంధించి పేదల జీవితాలతో చెలగాటమాడుతోందన్నారు. 2011లో కూల్చివేతలు అక్రమమని నాడు.. అప్పటి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ప్రస్తుత నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత రోడ్డెక్కారని, ఆ కూల్చివేతలు నేడు సక్రమం ఎలా అవుతాయో చెప్పాలని కేసీఆర్ను ప్రశ్నించారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఆయన చూపారు.
నాడు వైయస్ హయాంలో వక్ఫ్ భూములంటూ ఐటీ కంపెనీలను బ్లాక్ మెయిల్ చేశారని.. అదే పాత్రను ఇప్పుడు కేసీఆర్ పోషిస్తున్నారని ధ్వజమెత్తారు. ఎన్నికల సమయంలో ఇక్కడ నేను.. అక్కడ జగన్ అని చెబితే దానిని రాజకీయ కోణంలో చూశామని, ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే వైయస్ హయాంలో బ్లాక్ మెయిలింగ్, బెదిరింపులు వంటి పరిస్థితులను కల్పిస్తున్నారనే విషయం అర్థమవుతోందన్నారు.
మణికొండలో ఐటి కంపెనీలను వక్ఫ్ భూముల పేరిట భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, ఆ భూములు ముమ్మాటికి వక్భ్ భూములు కాదని ఓ సర్వే తేల్చిందన్నారు. వైయస్ హయాంలో దానిని టాంపరింగ్ చేశారన్నారు. ఆ భూములకు సంబంధించిన సమగ్ర ఆధారాలు బయటపెట్టాలన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు కేంద్రం వద్దకు వెళ్లి పనులు చేయించుకుంటుంటే తెలంగాణ సీఎం, మంత్రులు మాత్రం నిద్రపోతున్నారని ఎద్దేవా చేశారు.