కేసీఆర్కి లేఖరాసి ఏకేసిన బీజేపీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్
హైదరాబాద్: మెదక్ లోకసభ బీజేపీ అభ్యర్థిగా జగ్గారెడ్డి నామినేషన్ వేసినప్పటి నుంచి టీఆర్ఎస్ నేతలు, కేసీఆర్ కుటుంబ సభ్యులు అర్థం పర్థం లేని ఆరోపణలు చేస్తున్నారని, అసలు తెరాసకు నైతికత వర్తించదా అని బీజేపీ శాసన సభపక్ష ఉపనేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ శనివారం ప్రశ్నించారు. జగ్గారెడ్డి బీజేపీలో చేరడంపై తెరాస నేతలు గొంతు చించుకోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందన్నారు. ఆయన కేసీఆర్కు బహిరంగ లేఖ రాశారు.
తాండూరు నియోజకవర్గంలో విద్యార్థి జేఏసీ నేతలపై అక్రమ కేసులు పెట్టించి, అరెస్టులు చేయించిన మహేందర్ రెడ్డికి టికెట్ ఇవ్వడమే కాకుండా మంత్రిని చేయడం ఏ నైతికతకు ప్రాతిపదిక అని నిలదీశారు. ఒక టీవీ చర్చలో నాయిని నర్సింహా రెడ్డిని దూషిస్తూ కొట్టడానికి వెళ్లిని మహేందర్ రెడ్డి... మీకు తెలంగాణవాదిగా కనిపించాడా అని ప్రశ్నించారు.
సమైక్యవాద పార్టీ అయిన సీపీఎం నుంచి వచ్చిన నోముల నర్సింహయ్యను నాగార్జున సాగర్ నుంచి, ఎన్నికల ముందు వరకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో ఉన్న మహిపాల్ రెడ్డిని పటాన్చెరు నుంచి పోటీ చేయించలేదా అని నిలదీశారు. వైసీపీ తెలంగాణ ఇన్చార్జిగా ఉన్న బాజిరెడ్డి గోవర్దన్కు నిజామాబాద్ రూరల్ టికెట్ ఇవ్వలేదా అని పేర్కొన్నారు. వ్యవసాయ పంపుసెట్లకు 2-3 గంటల పాటు కరెంటు లేక రైతులు నానా యాతన పడుతుంటే మీ ఫాం హౌజ్కు మాత్రం 24 గంటల పాటు విద్యుత్తు సరఫరా కోసం ప్రత్యేకంగా లైన్లు వేయించుకున్నది వాస్తవం కాదా అని ప్రశ్నించారు.
ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ను పక్కన పెట్టి, బడ్జెట్ ప్రతిపాదనలు తయారు చేస్తున్నది మీరేనని ఓ పత్రిక కథనాన్ని ప్రచురిస్తే దానిపై అక్కసు వెళ్లగక్కడం ఎంత వరకు సమంజసమన్నారు. వీటన్నింటికీ జవాబులు చెప్పిన తర్వాతనే ఇతరులను విమర్శించే హక్కు మీకు, మీ కుటుంబ సభ్యులకు ఉంటుందని ప్రభాకర్ ఆ లేఖలో పేర్కొన్నారు.
ప్రజలకు మేలు చేయడానికి కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించి సమస్యలు పరిష్కరించే విషయంలో కేసీఆర్కు అహం అడ్డొస్తుందని మరో నేత నాగం జనార్దన్రెడ్డి ఆరోపించారు. పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ప్రకాష్రెడ్డితో కలిసి శనివారం ఆయన పార్టీ కార్యాలయంలో మాట్లాడారు. ఒక సీఎంగా కేంద్రంతో సఖ్యంగా మెలగాల్సిన బాధ్యత ఆయనపై లేదా అని ప్రశ్నించారు. మెడికల్ మేనేజ్మెంట్ కోటా ఫీజులను రూ.9 లక్షలు, రూ.11 లక్షలకు పెంచడం దారుణమని, బంగారు తెలంగాణ అంటే ఇదేనా అని ప్రశ్నించారు.
తన కొడుకు, అల్లుడికి మంత్రి పదవులు ఇచ్చుకున్న కేసీఆర్ ఎస్టీ ఎమ్మెల్యేల్లో సమర్థులే లేరన్నట్లు ఒక్క ఎస్టీ వ్యక్తికి మంత్రి పదవి ఇవ్వలేదని విమర్శించారు. కేసీఆర్ సొంత జిల్లా మెదక్లో రైతులు తీవ్ర ఇబ్బందులతో ఆత్మహత్యలు చేసుకుంటున్నా కనీసం పట్టించుకున్న పాపానపోలేదని బద్దం బాల్రెడ్డి నర్సాపూర్లో విమర్శించారు. ఆయన మెదక్ పార్లమెంటు ఉప ఎన్నికల ప్రచార కార్యాలయాన్ని ప్రారంభించారు. కేసీఆర్ సీఎంగా ప్రచార ఆర్భాటమే తప్ప చేతల్లో ఏమీ లేదన్నారు.