క్రికెట్ గ్రౌండ్ లో క్షుద్ర పూజలు .. పెద్ద బొమ్మ గీసి నల్లకోడిని బలిచ్చి
నెల్లూరు జిల్లా కోవూరులో క్రికెట్ గ్రౌండ్ లో క్షుద్ర పూజలు కలకలం రేపుతున్నాయి. కోవూరు మండలం పడుగుపాడులో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికులను భయాందోళనకు గురి చేస్తుంది . పడుగుపాడులో క్రికెట్ మైదానంలో నిన్న అర్థరాత్రి క్షుద్రపూజలు చేసినట్టుగా స్థానికులు గుర్తించారు . క్రీడా మైదానంలో పెద్ద బొమ్మ గీసి నల్లకోడిని బలిచ్చి క్షుద్ర పూజలు చేసిన ఆనవాళ్ళు ఉన్నాయి . దీంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చెయ్యగా రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టారు.
పడుగుపాడులో ఉన్న క్రికెట్ మైదానంలో అక్కడ యువకులు రోజూ క్రికెట్ ఆడుతుంటారు. ఎప్పటిలాగే గ్రౌండ్ కి క్రికెట్ ఆడేందుకు వెళ్ళిన స్థానికులు అక్కడ పెద్ద బొమ్మ, బలిచ్చిన నల్ల కోడిని చూసి షాక్ తిన్నారు. క్షుద్ర పూజల ఆనవాళ్లు కనిపించడంతో భయంతో పరుగు తీసిన వారు గ్రామంలోకి వెళ్లి క్షుద్రపూజల వ్యవహారం చెప్పారు . వెంటనే గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇవ్వటంతో ఈ క్షుద్రపూజలు ఎవరు చేశారు, ఎందు కోసం చేశారు అని దర్యాప్తు చేపట్టారు పోలీసులు .ఇది ఎవరి పనో తెలుసుకునే పనిలో పడ్డారు.
అసలే గ్రామం కావటంతో చేతబడి జరగడంతో ఏదన్నా అరిష్టం జరుగుతుందేమోనని స్థానికులు భయాందోళన చెందుతున్నారు . ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఈ ఘటనకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు . అయితే ఇంత ధైర్యంగా ఈ పని ఈ గ్రామంలో ఉండే వారే చేశారా? లేక బయటి నుంచి వచ్చిన వ్యక్తులు చేశారా ? అన్న దానిపై కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గుప్త నిధుల కోసం అని కొందరు అంటుంటే, ఎవరికో చేతబడి చేశారని కొందరు మాట్లాడుతున్నారు .