సీఎం జగన్ భద్రతకు ఆక్టోపస్ టీమ్: మూడు రాజధానుల ప్రకటన చేసిన మరుసటిరోజే భద్రత పెంపు
Recommended Video
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డి భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. నిన్నటి వరకు ఎస్పీఎఫ్ పోలీసులతోపాటు గన్ మెన్లు సీఎం జగన్ భద్రతను పర్యవేక్షించారు. అయితే తాజాగా ఆక్టోపస్ టీం ఆయనకు భద్రత కల్పిస్తోంది.ఆక్టోపస్ దళంలోని ప్రత్యేక కమాండోలను సీఎం భద్రతకు కేటాయించారు.
సీఎం భద్రతకు 30 మంది సభ్యులతో కూడిన ఆక్టోపస్ టీం
30 మంది సభ్యులతో కూడిన ఆర్గనైజేషన్ ఫర్ కౌంటర్ టెర్రరిస్టు ఆపరేషన్స్ (ఆక్టోపస్) టీం ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి రక్షణ కోసం రంగంలోకి దిగింది. డిసెంబర్ 18వ తేదీ బుధవారం తాడేపల్లిలోని సీఎం ఇంటి వద్ద ఆక్టోపస్ టీం విధులు చేపట్టింది. టెర్రరిస్ట్ ఆపరేషన్స్ కోసం ప్రత్యేకంగా ట్రైనింగ్ తీసుకున్న ఉగ్రవాద చర్యలు ఎదుర్కొనే దళమే ఆక్టోపస్ టీం. ఏపీ పోలీసులలో ఒక భాగమైన ఆక్టోపస్ టీం స్పెషల్ ఆపరేషన్స్ లో కీలకం గా వ్యవహరిస్తారు.
ఐదు బృందాలుగా రక్షణ కల్పించనున్న టీం
అలాంటి ఆక్టోపస్ టీం ఇప్పుడు సీఎంకు భద్రత కల్పిస్తున్నారు. ఆరుగురు సభ్యుల చొప్పున ఐదు బృందాలుగా ఏర్పడిన వారు సీఎం పర్యటనలు, సభలు ,సమావేశాల్లో పటిష్ట భద్రతను కల్పించడానికి రంగంలోకి దిగారు. ఇక ఈ ఆక్టోపస్ టీం ప్రస్తుతమున్న ఇంటిలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ తో పాటు పనిచేస్తుంది. ఇక ఇద్దరు అధికారులు ఈ టీంలను పర్యవేక్షిస్తారు.
ఇక సీఎం భద్రతతో పాటు వీఐపీల భద్రతకు సంబంధించిన అంశాలను సెక్యూరిటీ రివ్యూ కమిటీ ఎప్పటికప్పుడు పరిశీలిస్తుంది. ఈ కమిటీలో హోం సెక్రటరీ, బిజెపి, లా అండ్ ఆర్డర్ ఐజి, ఇంటెలిజెన్స్ చీఫ్ లు ఉంటారు.
మూడు రాజధానుల ప్రకటన తర్వాత రోజే సడన్ గా భద్రత పెంపు
అమరావతిలో ఒకే రాజధానిని కలిగి ఉండటానికి బదులుగా, రాష్ట్రానికి మూడు రాజధానులను ఏర్పాటు చేస్తే బాగుంటుందని సూచనప్రాయంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించిన తరువాత రోజే , సీఎం భద్రత అకస్మాత్తుగా పెరిగింది. విఐపి భద్రతలో రాష్ట్ర ప్రభుత్వం ఆక్టోపస్ను చేర్చిందని ముఖ్యమంత్రి కార్యాలయం బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది.భద్రత అకస్మాత్తుగాపెంచటానికి గల కారణాలను సిఎంఓ వివరించనప్పటికీ, విఐపిలపై ఎటువంటి అనూహ్య దాడులు జరగకుండానివారణ చర్యల్లో భాగంగా ఈ నిర్ణయంతీసుకున్నామనిపోలీసు శాఖ అధికారులు తెలియజేశారు.
భద్రత పెంపుకు గల కారణను వెల్లడించని ప్రభుత్వం
సీఎం జగన్ మోహన్ రెడ్డి Z + కేటగిరీలో లేనందున, కేంద్ర ప్రభుత్వం ఆయనకు భద్రత కల్పించదు. మాజీ సిఎం మరియు టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడికి నక్సల్స్ నుండి ముప్పు ఉన్న కారణంగానే ఆయనకు భద్రత కల్పిస్తుంది కేంద్రం . ఇక సీఎం జగన్ కు భద్రత పెంచేటప్పుడు ప్రభుత్వం లేదా పోలీసు శాఖ లేదా ఇంటెలిజెన్స్ విభాగం భద్రత పెంచటానికి ఎటువంటి భద్రతా కారణాలను లేదా ముప్పును గురించి వెల్లడించలేదన్నది ఇక్కడ ప్రాధాన్యత సంతరించుకున్న అంశం .