గ్రామ వలంటీర్ల వ్యవస్థపై ఒడిశా ఆరా: త్వరలో అధ్యయనానికి: వలసలను అరికట్టే ప్రయత్నం!
అమరావతి: మన రాష్ట్రంలో అమల్లోకి వచ్చిన గ్రామ వలంటీర్ల వ్యవస్థపై ఒడిశా ప్రభుత్వం తీస్తోంది. ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలను అర్హులైన లబ్దిదారుల గుమ్మం ముందుకు చేర్చేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ఈ వ్యవస్థలో అవినీతికి అవకాశం ఉండదనే భావిస్తోంది. ఈ తరహా వ్యవస్థను తమ రాష్ట్రంలో కూడా అమలు చేయడానికి అందుబాటులో గల అవకాశాలు, సాధ్యసాధ్యాలపై అధ్యయనం చేయడానికి సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. దీనిపై అధ్యయనం చేసి, ఓ సమగ్ర నివేదికను రూపొందించడానికి త్వరలోనే ఒడిశా అధికారులు మన రాష్ట్రానికి రావచ్చని సమాచారం. ఈ విషయాన్ని గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ అధికారులు ధృవీకరిస్తున్నారు.
ఇంటి ముందుకే సంక్షేమ పథకాలు..
స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆగస్టు 15వ తేదీన గ్రామ వలంటీర్ల వ్యవస్థను మన రాష్ట్రంలో అమలులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. చౌక ధరల దుకాణాల్లో లభించే నిత్యావసర సరుకులు సహా పింఛన్ వంటి సంక్షేమ పథకాలను గ్రామాలు, వార్డు స్థాయిలో అర్హులైన లబ్దిదారుల ఇళ్లకు చేర్చడానికి ప్రభుత్వం ఈ విధానాన్ని ప్రవేశ పెట్టింది. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ఏకకాలంలో అమల్లోకి వచ్చిన ఈ వ్యవస్థ వల్ల రెండున్నర లక్షల మందికి పైగా నిరుద్యోగ యువతకు ఉపాధి లభిస్తోంది. ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లు.. ఇన్ని లక్షల మంది నిరుద్యోగ యువతకు వారి సొంత గ్రామాలు, వార్డుల్లో ఉపాధి లభించడం, అవినీతికి అవకాశం లేకుండా చేయడానికి ఈ వ్యవస్థ ఓ మందులా పనిచేసిందని ఒడిశా ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఫలితంగా- తమ రాష్ట్రంలోనూ దీన్ని అమలు చేయడానికి సూచనప్రాయంగా అంగీకరించినట్లు చెబుతున్నారు.
వలసలను నిరోధించడానికి అవకాశం..
ఒడిశాలో నిరుద్యోగ శాతం కాస్త ఎక్కువే. ఉపాధి అవకాశాలు ఆశించిన స్థాయిలో లేకపోవడం వల్ల ఆ రాష్ట్రానికి చెందిన యువకులు పొట్ట చేతబట్టుకుని వలస వెళ్తున్నారు. నిర్మాణరంగం వెలిగిపోతున్న హైదరాబాద్, బెంగళూరు, అటు కోల్ కత, ముంబై వంటి నగరాలకు ఉపాధిని వెదుక్కుంటూ వెళ్తున్నారు. గ్రామ వలంటీర్ల వ్యవస్థను అమలు చేయడం వల్ల యువకులకు వారి స్వస్థలాల్లోనే ఉపాధిని కల్పించినట్టవుతుందని ఒడిశా ప్రభుత్వం భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఉన్న చోటే వారికి ప్రతినెలా గౌరవ వేతనాన్ని చెల్లించడం వల్ల వలసలను అరికట్టినట్టవుతుందనే అంచనాకు వచ్చిందని తెలుస్తోంది. పైగా- భౌగోళికంగా ఒడిశాలో మారుమూల గ్రామాలు అధికం. ఏజెన్సీ గ్రామాలు కూడా ఎక్కువే. కియోంఝర్, సుందర్ గఢ్, బోలంగీర్, నవరంగ్ పూర్, రాయగడ, కొంధమాల్ వంటి జిల్లాల్లో అటవీ ప్రాంతాలు అధికం. ఏజెన్సీ గ్రామాలు, గిరిజనుల సంఖ్య చెప్పుకోదగ్గ స్థాయిలో ఉంది.
మారుమూల గ్రామాలకు సంక్షేమ పథకాలను చేర్చడానికి..
ఏజెన్సీ, రవాణా వసతి లేని మారుమూల గ్రామాల్లో నివసించే ఆదివాసీల సంఖ్య ఒడిశాలో అధికం. ప్రభుత్వం అన్నీ సమకూర్చినప్పటికీ.. రవాణా వంటి సౌకర్యాల కొరత వల్ల వాటిని అవి లబ్దిదారుల వరకూ చేరట్లేదు. అందుబాటులో ఉండే సౌకర్యాలు అంతంత మాత్రమే. అలాంటి వారి ఇళ్లకు వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలను సమర్థవంతంగా, సమగ్ర స్థాయిలో అందజేయగలిగితే అంత కంటే ఇంకేం కావాలనే అభిప్రాయం ఒడిశా అధికారుల్లో వ్యక్తమౌతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో.. గ్రామ వలంటీర్ల వ్యవస్థను తమ రాష్ట్రంలో అమలు చేయడానికి గల సాధ్యసాధ్యాలను పరిశీలించడానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే ఓ అధికారుల బృందాన్ని పంపించవచ్చని తెలుస్తోంది.