మాలోకం కన్నా ఆఫీస్ బాయే బెటరా..? తెలివి ఎక్కువ ఉందని ఒప్పుకుంటే చర్చకు రెడీ: శ్రీకాంత్ రెడ్డి
ఆంధ్రప్రదేశ్లో అధికార వైసీపీ, విపక్ష టీడీపీల మధ్య మాటలయుద్ధం తీవ్రస్థాయికి చేరింంది. వైసీపీ ఏడాది పాలనపై అధికార, విపక్ష నేతల కౌంటర్, రివర్స్ కౌంటర్ కొనసాగుతోంది. ఏడాదిలో రాష్ట్రం అభివృద్ది చెందిందని.. గత ఐదేళ్ల కన్నా మెరుగైన పాలన సాధించామని వైసీపీ నేతలు అంటున్నారు.
ఒకడుగు ముందుకేసిన ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి.. కుప్పం ప్రజలకు అందిన సంక్షేమ ఫలాలపై చర్చకు రావాలని సవాల్ విసరడంతో గొడవ పీక్ స్టేజీకి చేరింది. దీనికి కౌంటర్గా చంద్రబాబు కాదు.. టీడీపీ ఆఫీస్ బాయ్ చర్చకొస్తారని టీడీపీ నేత బొండా ఉమా ఆగ్నికి అజ్యం పోశారు.
మేం డిగ్నిటీ ఆఫ్ లేబర్ గౌరవించే వ్యక్తులం అని శ్రీకాంత్ రెడ్డి చెప్పారు. గత ఐదేళ్ల పాలనలో కన్నా.. ఏడాదిలో పేదలు, రైతులు, మహిళలు, ఇతర సామాజిక వర్గాలకు న్యాయం జరిగిందన్నారు. ఇదీ నిరూపించేందుకు సిద్ధమని మరోసారి ఉద్ఘాటించారు. దీనిపై చర్చ కోసం కుప్పం రావాలని కోరితే వస్తానని.. లేదంటే లోకేశ్ ఓడిపోయిన మంగళగిరికి వచ్చేందుకు సిద్దమని పేర్కొన్నారు.
ప్రభుత్వ చీఫ్ విప్ అయినా.. సామాన్యుడిలా ఎమ్మెల్యేగా పోటీచేసి ఓడిపోయిన లోకేశ్తో చర్చకు సిద్దంగా ఉన్నానని శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. కానీ ఆఫీస్ బాయ్, రోజు కూలీ ఎవరినీ పంపించినా ఫరావలేదన్నారు. లోకేశ్ కన్నా మీ ఆఫీసు బాయ్కే విషయ పరిజ్ఞానం ఉందా అని ప్రశ్నించారు. అలా అని మీరు ఒప్పుకోవాలని శ్రీకాంత్ రెడ్డి సూచించారు. లోకేశ్ కన్నా ఆఫీస్ బాయ్కే పరిజ్ఞానం ఉంది అని ప్రకటిస్తే.. వారితో చర్చ జరిపేందుకు సిద్ధమని గడికోట శ్రీకాంత్ రెడ్డి మరో సవాల్ విసిరారు.