గృహనిర్మాణంపై అధికారులు వర్సెస్ మంత్రులు, మా జిల్లాలో ఒక్కటీ పూర్తి కాలేదు:అచ్చెన్నాయుడు
అమరావతి : కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి చందబాబు అనేక కీలక అంశాలపై సమీక్ష జరిపారు. గృహ నిర్మాణంపై జరిగిన సమీక్ష సందర్భంగా కలెక్టర్లకు సిఎం చంద్రబాబునాయుడు దిశానిర్ధేశం చేశారు. 2019 నాటికి గ్రామాలలో పది లక్షల ఇళ్ల నిర్మాణం లక్ష్యమని తెలిపారు.
ఇప్పటికే నిర్మాణం పూర్తయిన ఇళ్లకు వచ్చే నెల నుంచి ప్రతి నెలా సామూహిక గృహ ప్రవేశ కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. అలాగే వచ్చే ఏడాది నాటికి రాష్ట్రంలో 19 లక్షల గృహాల నిర్మాణం చేపట్టాలని అధికారులకు సూచించారు.
ఈ సందర్భంగా ఆర్టీజీ సీఈవో బాబు మాట్లాడుతూ గృహనిర్మాణంలో లబ్ధిదారుల్లో సంతృప్తి ఉందని చెప్పారు. ఇళ్ల నిర్మాణం పూర్తి కాకుండా సంతృప్తి ఎలా సాధ్యమని మంత్రి అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. శ్రీకాకుళం జిల్లాలో ఒక్క ఇల్లు కూడా ఇంకా పూర్తికాలేదన్నారు. ఇళ్లు కేటాయించకుండా జనాలు సంతృప్తిగా ఉన్నారని ఎలా చెబుతారని ఆయన ప్రశ్నించారు.
దీంతో చంద్రబాబు జోక్యం చేసుకుని రూ. 4 వేల కోట్లు ఖర్చు చేస్తున్న గృహనిర్మాణంపై ప్రజల్లో ప్రచారం చేసుకోవాలని సూచించారు. పథకాల అమలు, ఓనర్ షిప్ తీసుకునే విషయంలో మంత్రులు చురుగ్గా ఉండాలని సూచించారు. అనంతరం నిరుద్యోగ భృతి గురించి మాట్లాడుతూ వచ్చేనెల నుంచి నిరుద్యోగ భృతి ఇవ్వాలని నిర్ణయించినట్లు చంద్రబాబు తెలిపారు.