తూగో ప్రమాదం: అధికారులపై చర్యలు, బాబు సమీక్ష
హైదరాబాద్/రాజమండ్రి: తూర్పు గోదావరి జిల్లా నగరం గ్యాస్ పైప్ లైన్ పేలుడు ఘటన నేపథ్యంలో గెయిల్ యాజమాన్యం చర్యలు చేపట్టింది. అధికారుల పైన చర్యలు తీసుకుంది. ఇద్దరు జనరల్ మేనేజర్ స్థాయి అధికారులను సస్పెంట్ చేసినట్లు గెయిల్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎ కర్ణాటక్ ఆదివారం తెలిపారు.
లీకైన గ్యాస్ సాధారణంగా గాలిలో కలిసిపోతుందని ఆయన చెప్పారు. అయితే, ఈ గ్రామంలో లీకైన గ్యాస్ వలయాకారంలో ఎందుకు వుంది? పేలుడుకు ఎందుకు కారణమయింది? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నామన్నారు. కాగా, బాధిత కుటుంబాలకు ఇవ్వాలంటూ గెయిల్ అధికారులు రూ.3.89 కోట్ల చెక్కును కలెక్టర్కు అందజేశారు.
తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు మండలం నగరం గ్రామంలో గ్యాస్ పైప్ లైన్ పేలుడు ఘటనలో ఇప్పటి వరకు 19 మంది మృతి చెందారు. ఈ దారుణ ఘటనకు కారణమైన గెయిల్ సంస్థపై ఆదివారం పలు సెక్షన్ల కింద కేసు నమోదయింది. 304ఏ, 286, 338, 337 సెక్షన్ల కింద కేసు బుక్ చేశారు. మాలమహానాడు నేత రత్నాకర్, స్థానిక వీఆర్వో ఫిర్యాదు మేరకు నగరం పోలీసులు కేసు నమోదు చేశారు.
తమిళనాడు ప్రమాదంపై చంద్రబాబు సమీక్ష
తమిళనాడులో నిర్మాణంలో ఉన్న పదకొండు అంతస్థుల భవంతి కూలిపోయిన ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు సమీక్ష జరిపారు. ఈ ఘటనలో బాధితులు తెలుగు వారు కూడా ఉన్నారు. కాగా, ప్రమాదంలో మృతుల కుటుంబ సభ్యులకు రూ.2లక్షల చొప్పున పరిహారం చెల్లించనున్నట్లు తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. అలాగే గాయపడిన వారికి ఒక్కొక్కరికి 50వేల రూపాయల చొప్పున సాయం అందించనున్నట్లు తెలిపింది. ఇక ఈ ప్రమాదంలో మృతి చెందిన ఏపీ వారికి చంద్రబాబు ఐదు లక్షల రూపాయలు, గాయపడ్డ వారికి యాభై వేల రూపాయలు ప్రకటించారు.