ప్రజావేదిక విషయంలో జగన్ చెప్పిందొకటి .. అధికారులు చేసిందొకటి.. వ్యూహమా .. టెన్షనా
ప్రజావేదిక కూల్చివేస్తామంటూ ప్రకటించిన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం నాడు కూల్చివేతకు ముహూర్తం ఖరారు చేసారు. కానీ ఎపీలోని అధికారులు మంగళవారం రాత్రి నుండే కూల్చివేత ప్రారంభించారు. బుధవారం భవనాన్ని నేలమట్టం చేస్తామన్న జగన్.. ప్రకటించిన 24 గంటల్లోపే ప్రక్రియ ప్రారంభించారు. జగన్ చెప్పిందో ఒకటి అధికారులు చేసింది ఒకటి. అసలు ఎందుకు జగన్ ఆదేశాల కంటే ముందుగా ప్రజా వేదిక కూల్చేయటానికి అధికారులు ముందుకొచ్చారు. టీడీపీ నేతలు కోర్టుకు వెళ్తున్నారన్న టెన్షనా లేకా కోర్టులో వాదనలు జరిగే లోపే పని కానివ్వాలన్న వ్యూహమా అన్నది ఇప్పుడు చర్చకు దారి తీస్తుంది.
బ్రిటిషర్లు కట్టారని పార్లమెంట్ కూల్చేశారా అన్న జయప్రకాశ్ నారాయణ్.. ప్రజావేదిక కూల్చివేతపై జేపీ
బుధవారం కూల్చివేత అని ప్రకటించిన జగన్ .. మంగళవారం రాత్రి నుండే కూల్చివేత ప్రారంభం
ప్రజా వేదిక కూల్చెయ్యాలి అన్న జగన్ ఆదేశాలతో మంగళవారం కలెక్టర్ల కాన్ఫరెన్స్ ముగిసిన వెంటనే ప్రజావేదికలో సామాను మొత్తాన్ని అక్కడి నుంచి ఖాళీ చేయించారు . సీఆర్డీయే అధికారులు దగ్గరుండి ప్రజావేదికలోని ఫర్నీచర్తో పాటూ మిగిలిన సామగ్రిని మరో ప్రాంతాలకు తరలించారు. పూలకుండీల్ని హైకోర్టు సమీపంలోని నర్సరీకి తరలించారు . కూల్చివేతపై సీఆర్డీయే ఉన్నతాధికారులు, ఇంజినీర్లు సిబ్బందికి సూచనలు చేశారు.ఇక ఫర్నీచర్ తరలించిన తర్వాత కూల్చివేత ప్రక్రియను బుధవారం ప్రారంభించాలి కానీ మంగళవారం రాత్రి నుండే కూల్చివేత ప్రారంభించారు. ప్రజా వేదిక వద్దకు వచ్చిన జేసీబీలు.. కూలీలను పంపి ప్రజావేదిక మొత్తాన్ని కూలుస్తున్నారు. మంగళవారం రాత్రి నుంచే కూల్చివేత ప్రారంభించిన అధికారులు బుధవారం ఉదయానికి భవనాన్ని పూర్తిగా నేలమట్టం చేశారు.
కోర్టులో కేసు, టీడీపీ ఆందోళన నేపధ్యంలోనే వ్యూహాత్మక నిర్ణయం
ప్రజావేదిక కూల్చివేత ప్రక్రియను తక్షణమే నిలిపివేయాలని కోరుతూ హైకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలైంది. ప్రకాశం జిల్లా కారంచేడు మండలం స్వర్ణ గ్రామానికి చెందిన సామాజిక కార్యకర్త పి.శ్రీనివాసరావు ప్రజాప్రయోజ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ప్రజావేదిక కూల్చివేతను తక్షణం నిలిపివేయాలని దాఖలైన పిల్పై మంగళవారం అర్థరాత్రి 2.30 దాటిన తర్వాత కూడా ధర్మాసనం ఎదుట విచారణ కొనసాగింది. ఈ వ్యాజ్యంపై తీర్పు వెలువరించిన హైకోర్టు, కూల్చివేతను ఆపబోమని చెప్పింది . అడ్వొకేట్ జనరల్ వాదనతో ఏకీభవించిన ధర్మాసనం ప్రజావేదిక కూల్చివేత నిలుపుదలకు నిరాకరించి, కేసు తదుపరి విచారణను 2 వారాలకు వాయిదా వేసింది.
జగన్ మౌఖిక దేశాల మేరకే రంగంలో దిగిన అధికారులు .. ప్రజావేదిక కూల్చివేత దాదాపు సమాప్తం
వాస్తవానికి బుధవారం భవనాన్ని కూల్చివేద్దామని భావించినా మళ్లీ ఆలోచన మార్చుకున్నట్లు తెలుస్తుంది. జగన్ మౌఖిక ఆదేశాల మేరకే వ్యూహాత్మకంగా మంగళవారమే రంగంలోకి దిగింది జగన్ సర్కార్ . బుధవారం ఉదయం వరకు ఆగితే టీడీపీ ఆందోళనకు దిగుతుందన్న భావన ఒకటి, అలాగే భవనాన్ని కూల్చొద్దు అని కోర్టుకు వెళ్తున్న నేపధ్యంలో కోర్టులో స్టే వస్తే ఆపెయ్యాల్సి వస్తుంది అని భావించే మంగళవారం రాత్రి నుండే కూల్చివేతకు శ్రీకారం చుట్టారు. కానీ కోర్టు కూడా కూల్చివేత నిలుపుదల చెయ్యటం సాధ్యం కాదని చెప్పింది. ఇటు ముందస్తు జాగ్రత్తగా ప్రజావేదిక దగ్గర భారీగా పోలీసుల్ని మోహరించారు. టీడీపీ నేతలు ఆందోళనకు దిగే అవకాశముందనే అనుమానంతో పోలీసులతో భద్రతా ఏర్పాటు చేశారు. అందుకే రాత్రి సమయంలో పనిని పూర్తి చేయాలని అధికారులు భావించారని తెలుస్తుంది.