వామ్మో వీర తాగుబోతులు..! ఎలక్షన్ పేరుచెప్పి డ్రమ్ములు డ్రమ్ములు పీల్చేసారు..!!
అమరావతి/హైదరాబాద్ : ఎన్నికల పేరు చెప్పి ఏపిలో మద్యాన్ని తెగ పీల్చేసారు వీర తాగుబోతోలు. ఎక్సైజ్శాఖ చరిత్రలో తొలిసారిగా రికార్డుస్థాయి మద్యం విక్రయాలు జరిగాయి. ఎన్నికల్లో సరుకు మొత్తం ఖాళీ చేసేసిన వ్యాపారులు పోలింగ్ అయిపోయిన తెల్లవారే మద్యం డిపోలకు క్యూ కట్టారు. రాష్ట్రవ్యాప్తంగా 12, 13 తేదీల్లో ఏకంగా 302కోట్ల రూపాయల విలువైన మద్యాన్ని షాపులకు తరలించడం విశేషం. ఎన్నికలైన తర్వాత రోజైన 12న 178.31కోట్ల రూపాయలు, 13న 124.48కోట్ల రూపాయల మద్యాన్ని తీసుకున్నారు.
రెండు రోజుల్లో 302 కోట్ల నిల్వలు...! ఇదో చరిత్ర అంటున్న ఎక్సైజ్ అదికారులు..!!
గతంలో ఓసారి ప్రత్యేక పరిస్థితుల్లో ఒక్కరోజులోనే 190కోట్ల రూపాయల మద్యం దిగుమతులు జరిగినా తర్వాత రోజు పూర్తిగా ఆగిపోయాయి. కానీ ఇప్పుడు వరుసగా రెండో రోజూ 100కోట్ల రూపాయలు దాటి వ్యాపారులు కొనుగోలు చేయడం విశేషం. ఈ రెండు రోజుల్లో 4,63,560 కేసుల లిక్కర్, 5,96,034 కేసుల బీర్ను వ్యాపారులు తీసుకున్నారు. వేసవి కావడంతో లిక్కర్ కంటే బీర్ అమ్మకాలు పెరిగాయి.
మందు జాగ్రత్త...! ఎక్సైజ్ చరిత్రలో భారీ దిగుమతులు..!!
సాధారణంగా ఎన్నికల్లో డబ్బుతో పాటు ఓటర్లకు మద్యం సీసాలు పంపిణీకి ఆయా పార్టీల నాయకులే మద్యం ఎక్కువగా కొనుగోలు చేస్తారు. ఈసారీ అదే తరహాలో నేతలే షాపులను ఖాళీ చేసేశారు!. ప్రతినెలా సుమారు 1500 కోట్ల రూపాయల మద్యాన్ని తీసుకునే వ్యాపారులు, ఫిబ్రవరిలో 1861కోట్ల రూపాయలు తీసుకున్నారు. ఎన్నికల షెడ్యూలును ముందే ఊహించిన వ్యాపారులు ఇలా ‘మందు'జాగ్రత్తలు తీసుకున్నారు. షెడ్యూల్ విడుదల తర్వాత గతేడాది అమ్మినంతే అమ్మాలనే నిబంధనలు అమల్లోకి వస్తాయని తెలిసి, కొన్న సరుకులో చాలా వరకు బెల్టు షాపులకు తరలించేశారు.
ఎన్నికల్లో మొత్తం ఖాళీ..! మళ్లీ నింపేసిన వ్యాపారులు..!!
అనంతరం నోటిఫికేషన్ విడుదల తర్వాత చాలా షాపుల్లో మద్యం హాట్కేకుల్లా అమ్ముడుపోయింది. చాలా షాపుల్లో మధ్యాహ్నం తర్వాత సాధారణ కొనుగోలుదారులకు మందు దొరకలేదు. మార్చి 8న 102కోట్ల రూపాయలు, 5న 114కోట్ల రూపాయల చొప్పున మద్యం తీసుకున్నా కొరత స్పష్టంగా కనిపించింది. అంతకుముందు ఫిబ్రవరి 25న 111కోట్ల రూపాయలు, 26న 91కోట్ల రూపాయలు, 27న 92కోట్ల రూపాయలు, 28న 128కోట్ల రూపాయల మద్యం వ్యాపారులు తీసుకున్నారు. అయినా ఎన్నికల నేపథ్యంతో మొత్తం ఖాళీ అయ్యాయి. సాధారణంగా డిసెంబరు 31.. న్యూఇయర్ వేడుకల సందర్భంగా 100 నుంచి 120 కోట్ల రూపాయల వరకు వ్యాపారులు దిగుమతి చేసుకుంటారు.
ఫుల్లగా మద్యం..! ఎప్పుడూ లేని విధంగా దిగుమతులు..!!
కానీ ఇప్పుడు దాన్ని కూడా దాటి, సంక్రాంతి సీజన్లోనూ లేని దిగుమతులు ఇప్పుడు జరిగాయని ఎక్సైజ్ అధికారులు తెలిపారు. కాగా.. పోలింగ్ తర్వాత రెండు రోజుల్లో... అనంతపురం 13.65కోట్లు, చిత్తూరు 31.89కోట్లు, తూర్పుగోదావరి 34.51కోట్లు, గుంటూరు 30.41కోట్లు, కడప 15.14కోట్లు, కృష్ణా 35.5కోట్లు, కర్నూలు 19.21కోట్లు, నెల్లూరు 19.06కోట్లు, ప్రకాశం 18.96కోట్లు, శ్రీకాకుళం 15.55కోట్లు, విశాఖపట్నం 29.37కోట్లు, విజయనగరం 15.32కోట్లు, పశ్చిమగోదావరి 24.23కోట్ల విలువైన మద్యాన్ని వ్యాపారులు కొనుగోలుచేసుకున్నారు.