చిన్నారులపై ఆగని అఘాయిత్యాలు...నెల్లూరులో మరో కీచక వృద్దుడి ఆగడం,దేహశుద్ది
నెల్లూరు జిల్లా:ప్రభుత్వం, పోలీసులు ఎన్ని హెచ్చరికలు చేసినా ఆంధ్రప్రదేశ్ లో చిన్నారులపై అఘాయిత్యాలకు అడ్డుకట్ట పడటం లేదు. ఇటీవల వరసగా వెలుగు చూస్తున్న చైల్డ్ ఎబ్యూజ్ ఘటనలపై ప్రభుత్వం సీరియస్ గా స్పందించి అత్యంత తీవ్రమైన హెచ్చరికలు జారీ చేసిన సంగతి తెలిసిందే.
అయినా కామంతో కళ్లు మూసుకుపోయిన కామాంధులు ఇంకా పసివాళ్లపై అత్యాచారాలకు తెగబడుతున్న వైనం ప్రజలను నివ్వెరపరుస్తోంది. తాజాగా నెల్లూరు జిల్లాలో ఒక వృద్దుడు ఐదేళ్ళ చిన్నారిపై ఇదే రకంగా అఘాయిత్యానికి ప్రయత్నించగా ఆ బాలిక భయంతో కేకలు వేయడంతో ప్రమాదం తప్పింది. చిన్నారి కేకలు విన్న నాయనమ్మ ఘటనా స్థలానికి చేరుకోవడంతో పసిబిడ్డకు ముప్పు తప్పడంతో పాటు ఆ కీచక వృద్దుడి బండారం బైటపడింది. దీంతో ఇంత దారుణానికి ఒడిగట్టిన ఆ వృద్దుడికి స్థానికులు దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించారు. వివరాల్లోకి వెళితే...
నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని ఓ కాలనీలో ఆటలాడుకుంటున్న ఐదేళ్ల చిన్నారికి బిస్కెట్లు ఇస్తానని స్థానికంగా పొరుగునే నివాసం ఉండే వృద్ధుడు గురుస్వామి(60) చెప్పడంతో అభం శుభం తెలియని ఆ బాలిక అతడి మాటలు నమ్మి ఇంట్లోకి వెళ్లింది. ఆ చిన్నారికి వృద్దుడు బిస్కెట్లు తినిపిస్తూ మరోవైపు వికృత చేష్టలకు పాల్పడుతుండటంతో చిన్నారి భయంతో కేకలు వేసింది. దీంతో సమీపంలో ఉన్న బాలిక నాయనమ్మ పరుగున వచ్చి జరుగుతున్న దారుణం చూసి దిగ్భ్రాంతి చెందింది.
ఆ తరువాత ఆమె కూడా పెద్దగా కేకలు వేయడంతో వెంటనే అక్కడకు పోగయిన స్థానికులు వెంటనే అతడికి దేహశుద్ది చేశారు. ఆ తరువాత పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. అనంతరం బాధిత చిన్నారి తలిదండ్రులు స్థానిక పోలీసు స్టేషనులో వృద్దుడి ఆగడాలపై ఫిర్యాదు చేశారు. ఆమేరకు ఎస్ఐ రవినాయక్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.