గుంటూరులో దారుణం: 9ఏళ్ల బాలికపై వృద్ధుడి అత్యాచారం..
గుంటూరు: జిల్లాలోని దాచేపల్లిలో దారుణం చోటు చేసుకుంది. 9ఏళ్ల ఓ బాలికపై సుబ్బయ్య అనే వృద్ధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. విషయం తెలిసిన స్థానికులు, ముస్లిం సంఘాల నాయకులు బాధితులతో కలిసి నార్కట్పల్లి-అద్ధంకి రహదారిపై ధర్నాకు దిగారు.
నిందితుడిని వెంటనే అరెస్ట్ చేయాలంటూ పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు. ధర్నాతో హైవేపై కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మధ్యాహ్నాం లోగా నిందితుడిని అరెస్ట్ చేస్తామని హామి ఇవ్వడంతో బాధితులు ధర్నా విరమించారు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
గ్రామంలో ఎటువంటి ఉద్రిక్తతలు చోటు చేసుకోకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. కాగా, కథువా రేప్ ఘటన తర్వాత పోక్సో అత్యాచారాన్ని చట్టాన్ని మరింత కఠినతరం చేసినా పరిస్థితిలో మార్పు రాకపోవడం గమనార్హం. 12ఏళ్ల లోపు బాలికలపై అత్యాచారానికి పాల్పడితే మరణశిక్ష తప్పదు అని చెప్పినా నిందితుల్లో మార్పు రావడం లేదు.
ఘటనపై సీఎం సీరియస్:
దాచేపల్లి ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.