చెత్తకుప్పలో రద్దయిన పెద్దనోట్లు: మంత్రాలయంలో కలకలం..
గురువారం విధుల్లో ఉన్న పారిశుధ్య కార్మికులు చెత్తకుప్పలో రద్దయిన పెద్దనోట్లను గుర్తించారు.
మంత్రాలయం: కేంద్రం రద్దు చేసిన పెద్దనోట్లు కర్నూలు జిల్లా మంత్రాలయంలోని ఓ చెత్త కుప్పలో దర్శనమివ్వడం కలకలం రేపింది. పాత నోట్ల మార్పిడికి గడువు ముగిసిన 13రోజుల తర్వాత ఈ నోట్లు చెత్త కుప్పలో దర్శనమివ్వడం కర్నూలులో హాట్ టాపిక్ గా మారింది.
పోలీసుల కథన ప్రకారం.. మంత్రాలయం పుణ్యక్షేత్రంలోని బస్టాండ్ కు వెళ్లే రహదారిలో ఆర్&బి గెస్ట్ హౌజ్ పక్కన్నే ఓ చెత్త కుప్ప ఉంది. గురువారం విధుల్లో ఉన్న పారిశుధ్య కార్మికులు ఈ నోట్లను గుర్తించారు. రోడ్లపై ఊడ్చిన చెత్తను చెత్తకుప్పపై పడవేస్తుండగా.. రద్దయిన పెద్దనోట్లు వారి కంటపడ్డాయి.
విషయం ఆ నోటా.. ఈ నోటా.. పోలీసులకు తెలియడంతో ఎస్ఐ శ్రీనివాస్ నాయక్ అక్కడికి చేరుకున్నారు. రూ.12500 విలువ చేసే పాతనోట్లను పారవేసినట్టుగా గుర్తించారు. మంత్రాలయం వచ్చిన భక్తులెవరైనా ఈ చెల్లని నోట్లను ఇక్కడ పారేసుంటారా? అని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం దీనిపై పోలీసులు కూపీ లాగే ప్రయత్నం చేస్తున్నారు.