బాబు కోసం పాట.. వృద్దురాలి ప్రేమకు పరవశించిపోయిన సీఎం
ఓ వృద్ధురాలు ఆయన్ను చూసేందుకు ఆసక్తి కనబరించింది. ప్రేమగా దగ్గరికి వచ్చి పలకరించిన ఆమెను చంద్రబాబు ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్నారు.
తిరుపతి: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తలపెట్టిన నవనిర్మాణ దీక్ష గురువారం నాటితో ముగిసింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో జూన్ 2 నాడు బ్లాక్ డే ప్రకటించిన సీఎం.. వరుసగా ఏడు రోజుల పాటు నవ నిర్మాణ దీక్ష చేపట్టారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో ఈ నవనిర్మాణ దీక్షలు జరిగాయి.
నవ నిర్మాణ దీక్ష ముగింపు సందర్భంగా కాకినాడలో ఏర్పాటు చేసిన సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓ వృద్ధురాలు ఆయన్ను చూసేందుకు ఆసక్తి కనబరించింది. ప్రేమగా దగ్గరికి వచ్చి పలకరించిన ఆమెను చంద్రబాబు ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్నారు.
అనంతరం వేదికపై నుంచి మాట్లాడిన ఆ వృద్ధురాలు.. 'చంద్రబాబును దగ్గరి నుంచి చూడాలని ఇక్కడికి వచ్చానని, మీకోసం ఒక పాట పాడతాను' అని ఉత్సాహంగా చెప్పారు. చెప్పినట్లుగానే వేదిక పైనుంచి ఓ పాట పాడారు.
'చంద్రబాబు.. నిన్ను చూడాలని ఉంది. గోడల మీద, గుండెల మీద చూశాను.అయినా నా కడుపు నిండలేదు..కళ్లు నిండలేదు. నెలకు రెండొందల పింఛన్ పోయి.. వెయ్యి రూపాయలు చేశావు. మా బోటివాళ్లకు పెద్దకొడుకువయ్యావు. నీ తల్లికే నీవు కొడుకువి కాదయ్యా' అంటూ పాట పాడారు. వృద్దురాలి పాటకు సీఎం పరవశించిపోయారు. ఆపై ఆమె యోగ క్షేమాలు స్వయంగా అడిగి తెలుసుకోవడంతో.. వృద్దురాలి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.