ముందస్తు ఎన్నికల విషయంలో...చంద్రబాబు ఛాయిస్!..ఇదేనా?
అమరావతి:లెక్కప్రకారం వచ్చే సార్వత్రిక ఎన్నికలు 2019 ఏప్రిల్-మే నెలల్లో జరగాలి. కానీ, అంతకంటే నాలుగైదు నెలల ముందే ఎన్నికలకు వెళ్లడానికి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం భావిస్తున్నట్లు వివిధ సంకేతాలను బట్టి అర్థం అవుతోంది.
Recommended Video
కొంత మంది కేంద్ర మంత్రులు చేస్తున్న ప్రకటనలతో పాటుగా ఇటీవలే ఢిల్లీలో ప్రధాని మోడీతో భేటీ అయిన తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ అక్కడ నుంచి తిరిగి వచ్చిన తరువాత మాట్లాడుతున్న మాటలు, చేస్తున్నహడావుడి చూస్తుంటే ముందస్తు ఎన్నికలు ఖాయంగానే కనిపిస్తున్నాయి.మరి ముందస్తు ఎన్నికలు వచ్చేట్లయితే ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు వీటిపై ఏ నిర్ణయం తీసుకుంటారు?...అంటే...ఆయన అందుకు ముందుకు రారనే ఎక్కువమంది అభిప్రాయపడుతున్నారు.
ముందస్తు...ఖాయమా?
గత కొన్ని రోజులుగా కేంద్రం, తెలుగు రాష్ట్రాలకు చెందిన నేతలు చేస్తున్న ప్రకటనలు,హడావుడి చూస్తుంటే పార్లమెంట్ తో పాటు అసెంబ్లీ నియోజక వర్గాలకు కూడా ముందస్తు ఎన్నికలు రావడం ఖాయంగా కనిపిస్తోంది. దీనికి తోడు లోక్ సభకు, రాష్ట్రాల శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలనేది ప్రధాని మోడీ అభీష్టమని పలు సందర్భాల్లో ఆయన చేస్తున్న వ్యాఖ్యలను బట్టి స్పష్టంగా అర్థమవుతోంది.
కెసిఆర్ అలా...మరి చంద్రబాబు ఎలా?
ముందస్తు ఎన్నికలకు పొరుగు తెలుగు రాష్ట్రం తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ సుముఖంగానే ఉన్నట్లు ఆయన వ్యాఖ్యలను బట్టి స్పష్టమవుతోంది. దానం నాగేందర్ టిఆర్ఎస్ లో చేరిక సందర్భంగా కెసిఆర్ వ్యాఖ్యలను బట్టి కూడా అదే విషయం అర్థఅవుతోంది. మరైతే ముందస్తు ఎన్నికల విషయంలో ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు అభిప్రాయం ఏంటి?...గత అనుభవం దృష్ట్యా ఆయన ముందస్తు ఎన్నికలకు ముందుకు రాకుండా ససేమిరా...అంటారా?..లేక గతం గత: అని ముందుకు వస్తారా?...అనేది రాజకీయ శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారింది.
ముందుకు రారనే...అంటున్నారు
గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మూడుసార్లు ముందస్తు ఎన్నికలకు వెళ్లిన సందర్భాల్లో ఫలితాలు అధికార పార్టీని గద్దెదించాయి. ఈ మూడుసార్లలో ఒకసారి కాంగ్రెస్ బాధిత పార్టీ కాగా మిగిలిన రెండు సార్లు తెలుగుదేశం పార్టీ పరాజయం పాలైంది. పైగా ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు గతంలో తనంతట తానుగా ముందస్తు ఎన్నికలకు వెళ్లి పరాజయం మూట గట్టుకోవడంతో ఆయన మళ్లీ ముందస్తు ఎన్నికలకు వెళ్లరనే రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. గతంలో జరిగిన ఆ మూడు ముందస్తు ఎన్నికల వివరాలు ఇవి.
ఎప్పుడెప్పుడు...ఎలా అంటే...
1983లో కొత్తగా తెలుగు దేశం పార్టీ పెట్టిన ఎన్టీఆర్ ప్రభంజనాన్ని...ఆయన సభలకు దక్కుతున్న జనాదరణ ను చూసి ఖంగుతిన్న అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ప్రభావాన్ని ముందస్తు ఎన్నికలతో కొంతైనా అడ్డుకట్ట వేయొచ్చనే వ్యూహంతో ముందుకువెళ్లింది. దీంతో ఎపి చరిత్రలోనే తొలిసారి ముందస్తు ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో టిడిపి ఘన విజయం సాధించి అధికార కాంగ్రెస్కు అనూహ్యమైన ఝలక్ ఇచ్చింది. ఆ తరువాత 1989లో ఈసారి టీడీపీ ముందస్తు ఎన్నికల బరిలోకి దూకింది. అయితే ఆ ఎన్నికల్లో టీడీపీ ఓటమి పాలయింది. ఆ తరువాత అలిపిరి ఘటన తరువాత 2003లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ముందస్తు ఎన్నికలకు సిద్ధపడగా ఆ ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది.
అంత స్ట్రాంగ్ గా...ఎలా?
ఆంధ్రప్రదేశ్ లోని అధికార పార్టీకి సెంటిమెంట్ గా ముందస్తు ఎన్నికలు అచ్చిరావడం లేదు. గతానుభవాలు ఆ విషయాన్ని తేటతెల్లం చేస్తున్నాయి. మరి ఈ క్రమంలో సెంటిమెంట్లకు అధిక ప్రాధాన్యత ఇచ్చే చంద్రబాబు వాటిని తోసిరాజని మళ్లీ ముందస్తుకు వెళతారా? అంటే కష్టమేనంటున్నారు రాజకీయ పరిశీలకులు. టిడిపిలోని సీనియర్ నేతలు సైతం చంద్రబాబు ముందస్తు ఎన్నికల ఆలోచనలో లేనట్లే కనిపిస్తోందని ఆంతరంగిక చర్చల్లో వెల్లడిస్తున్నట్లు తెలుస్తోంది.
వస్తే... ఏం చెయ్యొచ్చు?
ఒకవేళ ముందస్తు ఎన్నికలు వస్తే డిసెంబర్ లో రావచ్చని అన్ని వైపుల నుంచి విశ్లేషణలు వెలువడుతున్నాయి. తెలంగాణా సిఎం కెసిఆర్ అయితే ముందస్తుకు సై అంటున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ముందస్తుకు రెడీ అంటే ఒకే...లేనిపక్షంలో ఎన్నికల నియమావళి ప్రకారం ఏం జరుగుతుందంటే?...ముందస్తు ఎన్నికలు జరిగితే ప్రస్తుత ప్రభుత్వ పాలనా సమయం ముగిసే ఆరు నెలల లోపు ముందస్తు ఎన్నికలు జరగాలి. లేదంటే ఏపీలో జనవరి7, 2019 తర్వాత ఎన్నికల సంఘం సార్వత్రిక ఎన్నికలను నిర్వహించే అవకాశం ఉంది. అప్పుడున్న ప్రభుత్వం రద్దవడం...రాష్ట్ర కేబినెట్ ముందస్తు ఎన్నికలు జరపమని గవర్నర్ను కోరడం జరిగేతేనే ముందస్తు ఎన్నికలు నిర్వహిస్తారు.
అసలు ఆ మాట...ఎందుకంటే?
ఒకేసారి జమిలి ఎన్నికలు నిర్వహించే ఉద్దేశ్యంతోనే ప్రస్తుతవ ముందస్తు ఎన్నికల మాట తెరమీదకు వస్తోంది. ఇలా ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం వల్ల ఎలక్షన్ కమిషన్కు ఖర్చులు తగ్గుతాయని కేంద్రం భావిస్తోంది. దీనికి నిపుణులు, విశ్లేషకుల నుంచి కూడా మద్దతు లభిస్తోంది. అయితే ఇది అనుకున్నంత తేలిక ప్రక్రియ కాదు. లోక్ సభతో పాటు అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించాలంటే చాలా రాష్ట్రాల్లో ఎన్నికలను ముందుకు జరపాలి. మరి కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలను వెనక్కి జరపాలి. అలా చేయడం వల్ల భారత రాజ్యాంగం సూచిస్తున్న ఐదేళ్ల అసెంబ్లీల కాల పరిమితి కొన్ని రాష్ట్రాల్లో పెరుగడం...మరి కొన్ని రాష్ట్రాల్లో తగ్గడం జరుగుతుంది. ఆ క్రమంలో ఇటీవలే నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్న కర్ణాటక లాంటి రాష్ట్రాలను మళ్లీ ఎన్నికల సిద్దపర్చడం ఎంత దర్లభమో ఊహించుకోవచ్చు.