దేవాన్ష్ బర్త్డే: తిరుమలలో ఫ్యామిలీతో బాబు, బాలకృష్ణ హ్యాపీగా, విరాళం(పిక్చర్స్)
తిరుపతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మనవడు, ఏపీ మంత్రి నారా లోకేష్-బ్రాహ్మణిల తనయుడు దేవాన్ష్ పుట్టిన రోజు సందర్భంగా వారి కుటుంబసభ్యులంతా బుధవారం ఉదయం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు.
ఫ్యామిలీతో బాబు
బుధవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరి, తనయుడు లోకేష్, ఆయన సతీమణి బ్రాహ్మణి, తనయుడు దేవాన్ష్లు, సినీనటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ, ఆయన సతీమణి వసుంధర, ఇతర కుటుంబసభ్యులు.. పద్మావతి విశ్రాంతి సముదాయం నుంచి బయలుదేరి వైకుంఠం-1 మీదుగా ఆలయానికి చేరుకున్నారు.
ప్రసాద సముదాయంలో భక్తులతో..
శ్రీవారిని దర్శించుకున్న తర్వాత రంగనాయకుల మండపంలో టీటీడీ నుంచి వేద ఆశీర్వచనం, సత్కారాలు అందుకున్నారు. ఇక్కడి నుంచి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ నిత్య అన్నప్రసాద సముదాయానికి చేరుకుని భక్తులతో మాట్లాడడంతో పాటు అన్నప్రసాదాలు వడ్డించారు. వారితో కలిసి అల్పాహారం స్వీకరించారు.
అన్న ప్రసాద వితరణకు విరాళం
చంద్రబాబు కుటుంబం దేవాన్ష్ పేరిట రూ.26 లక్షల విరాళాన్ని అందజేశారు. భక్తకోటికి ఒక రోజు అన్నప్రసాద వితరణకు రూ.26 లక్షల వ్యయం అవుతోంది. ఈ మొత్తాన్ని విరాళంగా ఇవ్వాలని భువనేశ్వరి నిర్ణయించారు. కాగా, గత రెండేళ్లుగా జన్మదినం సందర్భంగా రూ.20 లక్షల వంతున విరాళాలను సమర్పించారు.
మనవడితో హ్యాపీ చంద్రబాబు
కాగా, ఎప్పుడూ అధికారిక కార్యకలాపాలతో బిజీగా ఉండే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుమల ఆలయంలో మనవడు దేవాన్ష్తో ప్రశాంతంగా, సరదాగా కనిపించారు. మనవడి వెంట నడుస్తూ.. చిరునవ్వులు చిందిస్తూ సంతోషంగా దర్శనమిచ్చారు.
ప్రత్యేక ఆకర్షణగా..
ఇక మనవడు నారా దేవాన్ష్ ఎంతో ఉత్సాహంగా తిరుమల ఆలయంలో సందడి చేశాడు. తిరుమల ఆలయంలో తాత చంద్రబాబుతోపాటు నడుస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు.
బాబు, బాలయ్య
చంద్రబాబు, బాలకృష్ణలు శ్రీవారి ఆలయ సందర్శన సందర్భంగా భక్తులు, అభిమానులకు అభివాదం తెలుపుతూ కనిపించారు. బాబు, బాలకృష్ణ, దేవాన్ష్లు తిరుమల ఆలయానికి రావడంతో కొంత సందడి నెలకొంది.
నిరాడంబరంగానే..
ముఖ్యమంత్రి తన వ్యక్తిగత పర్యటనలో భాగంగా తిరుమలకు రావడంతో నిరాడంబర వాతావరణం కనిపించింది. నేతలు, ఇతర ప్రముఖుల హడావుడి లేకుండా ముందస్తు సూచనలతో చర్యలు తీసుకున్నారు. విమానాశ్రయం నుంచి తిరుమలకు వస్తూ తన వాహనంలో వెనుక భాగంలో జిల్లా కలెక్టరు ప్రద్యుమ్న, ఎమ్మెల్యే సుగుణమ్మలు ఉండగా, వారితో మాట్లాడుతూ వచ్చారు.