బి అలర్ట్:ఓ వైపు ఎండలు...మరోవైపు పిడుగులు;ఎపిలో విచిత్ర వాతావరణం
అనంతపురం,విశాఖపట్టణం: ఎపిలో విచిత్ర వాతావరణం నెలకొంది. ఓ వైపు ఎండలు మండిపోతుంటే మరోవైపు పిడుగులు వణికిస్తున్నాయి. దీంతో ప్రజలు ప్రకృతి ప్రకోపానికి గురికాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మీడియా ద్వారా అధికారులు ప్రజలకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
కొన్ని జిల్లాల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగిపోనున్నయి జాగ్రత్తగా ఉండాలంటూ అధికారులు హెచ్చరిస్తుండగా మరోవైపు ఆ మూడు జిల్లాల్లో పిడుగులు పడనున్నాయి అలెర్ట్ గా ఉండాలంటూ వాతావరణ శాఖ ప్రకటించింది. ఎపి దక్షిణాది సరిహద్దు జిల్లా అనంతపురం నుంచి కోస్తా జిల్లాల వరకు ఎండలు మరింత మండిపోవడం ఖాయమని, మూడు ఉత్తరాది జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం ఉన్నట్లు విశాఖ వాతావరణ శాఖ హెచ్చరించింది.
ఎండ తాకిడి...జాగ్రత్త
మంగళ, బుధవారాల్లో రెండు రోజులపాటు రాష్ట్రంలో ఉష్ణోగ్రతల్లో భారీ మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని అనంతపురం డీఆర్ఓ రఘునాథ్ తెలిపారు. ఈ రెండు రోజుల్లో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఎండలో తిరగవద్దని ప్రజలకు ఆయన సూచించారు. రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ ఈ హెచ్చరికలు జారీ చేసినట్లు ఆయన సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ఈ రెండు రోజులు...మరింత ఎండ
మే 1,2 తేదీల్లో...ఈ రెండు రోజుల్లో ఉష్ణోగ్రతలు 41 నుంచి 45 డిగ్రీల సెల్సియస్ వరకు చేరుకోవచ్చని రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ హెచ్చరించినట్లు తెలిపారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజలు మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసరమైతే తప్ప బయటికి వెళ్లవద్దని సూచించారు. ఈ హెచ్చరికను తీవ్రంగా పరిగణించి ప్రజలు అప్రమప్తంగా మెలగాలని, ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో బైటకు వెళ్లాల్సివచ్చినా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అనంతపురం డీఆర్ఓ రఘునాథ్ హెచ్చరించారు.
మరోవైపు...ఆ మూడు జిల్లాల్లో...పిడుగులు...
మరోవైపు మూడు ఉత్తరాది జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం ఉన్నందున ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వాహణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఎపిలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వాహణ శాఖ హెచ్చరించింది. ఈ మూడు జిల్లాల్లో అధిక మండలాల్లో ఉధృతంగా పిడుగులు పడే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు పేర్కొంది. దీంతో ప్రజల అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
ఇప్పటికే...ఆ జిల్లాల్లో వర్షాలు
వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఇప్పటికే శ్రీకాకుళం జిల్లాలో ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు కురుస్తున్నారు. ఇచ్చాపురం, పలాస, ఆముదాలవలస, శ్రీకాకుళంలో వర్షాలు పడుతున్నాయి. అలాగే విజయనగరం జిల్లాలోని పార్వతీపురం, బొబ్బిలి ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడి వర్షం కురుస్తోంది. పిడుగులు పడే అవకాశం ఉన్నందున ప్రజలు సురక్షిత భవనాల్లో ఆశ్రయం పొందాలని రాష్ట్ర విపత్తుల నిర్వాహణ శాఖ అధికారులు సూచిస్తున్నారు.